Andhra News: సీఎం జగన్‌ అలా అంటే.. నేనైనా వైదొలగాల్సిందే: మాజీ మంత్రి బాలినేని

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌ ఆయనకు టికెట్‌ ఇవ్వరేమోనని బాలినేని అన్నారు.

Updated : 23 Jan 2023 19:13 IST

సింగరాయకొండ: ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇవ్వకపోవచ్చని అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మార్కెట్ యార్డు ఛైర్మన్‌ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్‌ రాకపోవచ్చు. నా భార్య సచీదేవికి టికెట్‌ ఇస్తారేమో? నీకు సీటు లేదు. నీ భార్యకు ఇస్తామని సీఎం జగన్‌ అంటే నేనైనా చేసేదేమీ లేదు. ఈసారి మహిళలే.. అని తేల్చి చెబితే నేనైనా పోటీ నుంచి వైదొలగాల్సిందే. నియోజకవర్గ స్థాయి నేతలు విభేదాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పని చేయాలి. జిల్లాలోని కొండేపి వైకాపా సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు.. పార్టీ కార్యకర్తలు, నాయకులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వేదిక మీదుగా చెబుతున్నా.. పార్టీ గెలుపు కోసం అందరితో నడవాలి. 2019లో కొండేపి నియోజకవర్గంలో వైకాపా ఓటమిని చవిచూసింది. ఈ సారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో గెలిచి తీరాలి. వైకాపా జెండా ఎగురవేయాలి’’ అని బాలినేని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని