AP NEWS: 3 రాజధానులపై ముందుకే: బొత్స

రాష్ట్రంలో త్వరలోనే మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని, ఇది ప్రభుత్వ విధానమని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ...

Published : 04 Jun 2021 01:04 IST

అమరావతి‌: రాష్ట్రంలో త్వరలోనే మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని, ఇది ప్రభుత్వ విధానమని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసి తీరుతామన్నారు. న్యాయస్థానంలో ఉన్న కేసులు సత్వరం పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 

రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరే సీఎం పనిచేయవచ్చన్న మంత్రి... న్యాయస్థానంలో కేసులకు, సీఎం పనిచేయడానికి సంబంధం లేదన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఇప్పటికే నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందన్నారు. రాజధానుల ఏర్పాటుపై రాజ్యాంగానికి అనుగుణంగానే చర్యలు తీసుకున్నామన్నారు. పేదలందరికీ ఇళ్లు ఉండాలని రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలకు సీఎం ఇళ్ల స్థలాలు ఇచ్చారని, తొలి దశలో 15లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తోన్న 17వేల జగనన్న కాలనీల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా గృహ నిర్మాణం చేపడతున్నాయన్న మంత్రి.. కాలనీల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని