RK Roja: కేటీఆర్‌ గారు.. మీ ఫ్రెండ్‌ చెప్పింది తప్పు: ఏపీ మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన అనంతరం ప్రగతి భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన...

Updated : 30 Apr 2022 06:17 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన అనంతరం ప్రగతి భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మర్యాద పూర్వకంగా సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్టు తెలిపారు. ఏపీ విషయంలో మంత్రి కేటీఆర్‌ను ఎవరో తప్పుదోవ పట్టించారని అర్థమవుతోందన్నారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాలు అన్నారు.. ఆంధ్రప్రదేశ్‌ అనలేదు. ఒక వేళ ఏపీ గురించి అని ఉంటే తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. కేటీఆర్‌ను ఆంధ్రప్రదేశ్‌కు సాదరంగా ఆహ్వానిస్తున్నానని, కేటీఆర్‌తో పాటు ఆయనకు చెప్పిన ఫ్రెండ్‌ కూడా వస్తే.. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని దగ్గరుండి చూపిస్తానని రోజా చెప్పారు.

‘‘ఏపీ పథకాలను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. నాడు-నేడు కింద బడులు, ఆసుపత్రులు ఎలా అభివృద్ధి చేశామో చూపిస్తాం. భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి. కొవిడ్‌ తర్వాత రాష్ట్రంలో 9వేల కిలోమీటర్ల అంతర్గత రహదారులు ఏ విధంగా వేస్తున్నారో చూపిస్తాం. కేంద్రంతో కలిసి జాతీయ రహదారుల నిర్మాణం ఎలా జరిగిందో వివరిస్తాం. అవినీతికి తావులేకుండా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్న తీరును మంత్రి కేటీఆర్‌కు చూపిస్తాం. ఆయన కూడా స్ఫూర్తి పొంది తెలంగాణలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలనుకునే విధంగా తెలుసుకుంటారు. మంత్రిని మిస్‌ గైడ్‌ చేస్తూ ఫ్రెండ్‌ చెప్పింది కూడా తప్పని కేటీఆర్‌ తెలుసుకుంటారని భావిస్తున్నా. కేటీఆర్‌ తేదీ, సమయం ఇస్తే.. పర్యాటక శాఖ మంత్రిగా రాష్ట్రమంతా తిరిగి చూపిస్తా’’ అని రోజా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని