Assembly Elections: కర్ణాటక ఎన్నికలు ముగిశాయ్‌.. మరి నెక్స్ట్‌ ఏంటీ?

Assembly Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు ముగియడంతో రాజకీయ పార్టీలు తదుపరి కార్యాచరణపై దృష్టిపెట్టాయి. సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల్లో నవంబర్‌/డిసెంబర్‌లలో జరగబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమదైన వ్యూహాలతో ప్రచారానికి సన్నద్ధమవుతున్నాయి.

Updated : 14 May 2023 19:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటక(Karnataka)లో ఎన్నికల సందడికి తెరపడింది. అధికార భాజపా(BJP)ను ఓడించిన కన్నడ ప్రజలు కాంగ్రెస్‌(Congress)కు చారిత్రక విజయం అందించి ఆ పార్టీకి కొత్త ఊపిరిలూదారు.  ఇకపోతే, అక్కడ ముఖ్యమంత్రి ఎంపిక ఒక్కటే ఇంకా మిగిలింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లలో ఎవరికి సీఎం పీఠం అప్పగిస్తారోనన్న ఆసక్తి మినహా కర్ణాటక ఎన్నికల ప్రక్రియంతా దాదాపు ముగిసినట్టే. అయితే, ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ తమ దృష్టిని ఈ ఏడాది చివరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనే కేంద్రీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించే ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా  తమదైన వ్యూహాలతో ప్రచారం షురూ చేయనున్నాయి.

మళ్లీ సందడే.. సందడి..

కర్ణాటక ఎన్నికల్లో అనుభవం కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం తీసుకురాగా..  దక్షిణాదిలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని కోల్పోయిన భాజపాకు కొంత నిరాశ మిగిల్చింది. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును బేరీజు వేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు అస్త్రాలను సిద్ధంచేసుకోవడంపై ఫోకస్‌ పెట్టాయి. 2023 సంవత్సరం ఆరంభమైన తర్వాత ఫిబ్రవరిలో ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, త్రిపుర, మేఘాలయాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. భాజపా సత్తా చాటిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌కు రికార్డు విజయం లభించింది. ఈ ఏడాది చివర్లో నవంబర్‌/ డిసెంబర్‌ నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న వేళ మళ్లీ ఎన్నికల సందడి షురూ కానుంది. సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించే ఈ ఎన్నికలు కాంగ్రెస్‌, భాజపాలతో పాటు ఆయా ప్రాంతీయ పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి. 

ఏ అసెంబ్లీ గడువు ఎప్పటితో ముగుస్తుంది?

  • ఛత్తీస్‌గఢ్‌(90 సీట్లు) - నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2024 జనవరి 3తో అసెంబ్లీ గడువు ముగియనుంది)
  • మధ్యప్రదేశ్‌(230) - నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2024 జనవరి 6తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది)
  • మిజోరం(40)- నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2023 డిసెంబర్‌ 17తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది)
  • రాజస్థాన్‌(200)-డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2024 జనవరి 14తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది)
  • తెలంగాణ(119)-నవంబర్‌- డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2024 జనవరి 16తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది)

కశ్మీర్‌లోనూ ఎన్నికలకు ఛాన్స్‌?

ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీల గడువు వేర్వేరు తేదీల్లో ముగుస్తున్నప్పటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, ఈ ఏడాది కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లోనూ ఎన్నికలు నిర్వహించే ఛాన్స్‌ ఉన్నట్టు సమాచారం. శీతాకాలం తర్వాత ఈ ఏడాది వేసవిలోనే జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించవచ్చని, అక్కడి భద్రతాపరమైన పరిస్థితులను బట్టి ఎన్నికల నిర్వహణపై నిర్ణయం ఉండొచ్చంటూ గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా జులై 1 నుంచి ఆగస్టు 31వరకు మొత్తం 62 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగే అమర్‌నాథ్‌ యాత్ర ముగిసిన తర్వాత అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.  అలాగే, ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా అసెంబ్లీలకు వచ్చే ఏడాది జూన్‌ నాటికి గడువు ముగుస్తుంది. అయితే, లోక్‌సభ ఎన్నికలు సాధారణంగా ఏప్రిల్‌ మే నెలలో జరగనున్నందున ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలతో పాటే జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని