ఆ 5 రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికల నగారా!

పశ్చిమ బెంగాల్‌తోపాటు మరో నాలుగు రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది.

Published : 10 Feb 2021 18:28 IST

ఫిబ్రవరి 15 తర్వాత షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌తోపాటు మరో నాలుగు రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది. కరోనా విజృంభణ సమయంలోనూ బిహార్‌ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. ప్రస్తుతం ఏర్పాట్లను సమీక్షిస్తోన్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై ఫిబ్రవరి 15 తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది.

శాసనసభ ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అసోం, పశ్చిమ బెంగాల్‌లో పర్యటించింది. తాజాగా బుధ, గురు వారాల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించనుంది. ఇక పశ్చిమ బెంగాల్‌లో ఆరు నుంచి ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, అసోంలో మాత్రం రెండు, మూడు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశాలను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

పుదుచ్చేరి మినహా మిగతా నాలుగు రాష్ట్రాల శాసనసభల గడువు మే, జూన్‌ నెలలలో ముగియనుంది. దీంతో ఎన్నికలను ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌(సీఈసీ) సునిల్‌ అరోడా, ఎన్నికల కమిషనర్లు సుశీల్‌ చంద్ర, రాజీవ్‌ కుమార్‌లు మూడు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించనున్నారు.

ఇవీ చదవండి..
బెంగాల్‌ మార్పు కోరుతోంది: నడ్డా
ఎన్నికల తర్వాత..దుకాణాలు మూసుకోవాల్సిందే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని