Ts News: ప్రభుత్వ నిర్లక్ష్యం.. 14లక్షల మంది బీసీ విద్యార్థులకు మానసిక క్షోభ

తెలంగాణ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను వెంటనే చెల్లించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌..

Updated : 14 Jan 2022 16:43 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను వెంటనే చెల్లించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. గత రెండేళ్లుగా బీసీ విద్యార్థులకు చెల్లించకపోవడంతో ప్రభుత్వం దాదాపు రూ.3 వేల కోట్లు బకాయి పడినట్లు తెలిపారు. ఈ మేరకు బండి సంజయ్‌ ప్రకటన విడుదల చేశారు. కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్టాలంటూ విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 14 లక్షల మంది బీసీ విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ఫీజులు చెల్లించకపోవడంతో బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేసినా కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పీజీ కోర్సులకు ఫీజులు ఎంత ఉంటే అంత ప్రభుత్వమే చెల్లించేది. తెరాస ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి తూట్లు పొడిచింది. 10 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి మాత్రమే ఫీజులు పూర్తిగా మంజూరు చేస్తున్నారు. ఆపై ర్యాంకు వచ్చిన వారికి రూ.35 వేలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. మిగిలిన ఫీజు కట్టలేక విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను తక్షణమే చెల్లించాలి. ఉమ్మడి ప్రభుత్వం అమలు చేసిన మాదిరిగానే ఇంజినీరింగ్, మెడిసిన్, ఐఐటీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే వారికి పూర్తిగా ఫీజులు చెల్లించేలా జీవో నెం.18ని సవరించాలి’’ అని బండి సంజయ్‌ ప్రభుత్వాన్ని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని