Bandi Sanjay: నా నుంచి భైంసా ప్రజలను వేరు చేయలేరు: బండి సంజయ్‌

ప్రజా సంగ్రామ యాత్రను అడుగడుగనా అడ్డంకులు సృష్టిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి విడత యాత్రకు అనుమతిచ్చిన పోలీసులు.. ఇప్పుడెందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

Published : 28 Nov 2022 15:34 IST

కరీంనగర్‌: ప్రజా సంగ్రామ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి విడత యాత్రకు అనుమతిచ్చిన పోలీసులు.. ఇప్పుడెందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కరీంనగర్‌లోని భాజపా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడారు. 

‘‘ఇప్పటివరకు 4 విడతలుగా ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏదో ఒక సాకుతో పాదయాత్రను అడ్డకునేందుకు యత్నిస్తోంది. అందుకే హైకోర్టును ఆశ్రయించాం. ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల పట్ల సంతోషంగా ఉన్నాం. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయత్రను కొనసాగిస్తాం. అందులో భాగంగా ఇవాళ నిర్మల్ నియోజకవర్గంలోని ఆడెల్లి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అక్కడి నుండే పాదయాత్రను ప్రారంభిస్తాం. భైంసాకు దూరం చేశారేమో కానీ భైంసా ప్రజల నుంచి బండి సంజయ్‌ని దూరం చేయలేరనే విషయాన్ని ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలి. ఎంఐఎం, తెరాస కలిసి ఎన్ని కుట్రలు చేసినా బండి సంజయ్ నుంచి భైంసా ప్రజలను వేరు చేయలేరు? అక్కడికి ఎందుకు వెళ్లకూడదు? బైంసా వెళ్లాలంటే వీసా కావాలా? అనుమతి తీసుకోవాలా? భైంసా ఈ దేశంలో, తెలంగాణలో లేదా?

అసలు భైంసాలో అల్లర్లు సృష్టించిందెవరు? ఆ అల్లర్లలో గాయపడ్డ వారిని ఆదుకున్నది ఎవరు? అమాయకుల ఉసురు తీసిందెవరు? పీడీ యాక్ట్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిందెవరు? మేం భైంసాలో పాదయాత్ర చేస్తే ఇవన్నీ బయటకొస్తాయనే భయంతోనే భైంసాకు వెళ్లకుండా ప్రభుత్వం కుట్ర చేసింది. గతంలో పాతబస్తీలో పాదయాత్రను ప్రారంభించాం. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర చేస్తే అల్లర్లు జరిగాయా? ప్రశాంతంగా యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకు? కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదు. పాదయాత్ర ద్వారా ప్రజలతో మాట్లాడుతాం. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాం. వారికి భరోసా కల్పిస్తాం’’ అని బండి సంజయ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని