TS Politics: తెరాస అధికారం ఒక్క సంవత్సరమే : బండి సంజయ్‌

భాజపాకు అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తెరాస నేతలు, కార్యకర్తలు తీవ్రమైన మానసిక ఒత్తిడితోనే మా ఎంపీపై దాడి చేశారని విమర్శించారు. ‘‘ కేసీఆర్‌.. నెంబర్‌ వన్‌ తెలంగాణ ద్రోహి...

Published : 27 Jan 2022 18:35 IST

నందిపేట్‌ : భాజపాకు అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తెరాస నేతలు, కార్యకర్తలు తీవ్రమైన మానసిక ఒత్తిడితోనే మా ఎంపీపై దాడి చేశారని విమర్శించారు. నిజామాబాద్‌లోని నందిపేట్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ కేసీఆర్‌.. నెంబర్‌ వన్‌ తెలంగాణ ద్రోహి. ముఖ్యమంత్రి‌, ఆయన కుటుంబ సభ్యులు ఏం త్యాగాలు చేశారు? ప్రజల్లో చైతన్యం వచ్చింది, మార్పు కోరుకుంటున్నారు. ఈ ఒక్క సంవత్సరమే తెరాస అధికారంలో ఉంటుంది. తర్వాత కచ్చితంగా భాజపా ప్రభుత్వమే వస్తుంది.’’ అని  ధీమా వ్యక్తం చేశారు.

ఎంపీ అర్వింద్‌పై దాడి చేస్తారని, డీజీపీకి, సీపీకి ముందే తెలుసని అన్నారు. సీఎం కార్యాలయం దర్శకత్వంలో నిజామాబాద్‌ సీపీ నేతృత్వంలోనే పోలీసు అధికారులు దాడి చేశారని ఆరోపించారు. ఎంపీపై దాడి చేస్తే ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని మండిపడ్డారు. భాజపా కార్యకర్తలపై కత్తులతో దాడులు చేశారని, హత్యాయత్నం చేసిన వారు బహిరంగంగా తిరుగుతున్నారని ఆరోపించారు. రేపో, ఎల్లుండో నిందితులతోనే మాపై ఫిర్యాదు చేయించి కేసు పెడతారేమో అన్నారు. నిజాం కాలంలోనూ ఇంత నిర్బంధం చూడలేదని పెద్దమనుషులు చెబుతున్నారని, తెరాస పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని బండి జోష్యం చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని