Telangana News: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా బండి సంజయ్‌ ప్రమాణం

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తనకు సంబంధంలేదని లక్ష్మీనరసింహస్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేశారు. సీఎం కేసీఆర్‌ కూడా ఇదే విధంగా ప్రమాణం చేయాలని కోరారు.

Updated : 28 Oct 2022 16:56 IST

యాదాద్రి: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన వ్యవహారంతో తమకు సంబంధం లేదని భాజపా నేతలు మొదటి నుంచి చెబుతున్నారు. ఈ క్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరో అడుగు ముందుకేసి.. సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. ఎమ్మెల్యేలకు కొనుగోలు వ్యవహారంతో సంబంధంలేదని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానని, సీఎం కేసీఆర్‌కు కూడా ప్రమాణం చేయాలని డిమాండ్‌ చేశారు. ముందుగా ప్రకటించిన విధంగానే ఇవాళ మధ్యాహ్నం మునుగోడు నుంచి కార్యకర్తలతో కలిసి యాదాద్రి చేరుకున్న బండి సంజయ్‌.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తనకు సంబంధంలేదని లక్ష్మీనరసింహస్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేశారు. సీఎం కేసీఆర్‌ కూడా ఇదే విధంగా ప్రమాణం చేయాలని కోరారు.

అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాకు ఐటమ్‌ సాంగ్‌ జోడించారు: బండి సంజయ్‌

యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేసిన తర్వాత బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ ప్రజలు తలదించుకునే విధంగా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. మా ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నారు. ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ భాజపాను అప్రతిష్ఠపాలు చేసేందుకు యత్నిస్తున్నారు. తెరాస చేస్తున్న ఆరోపణలు ఖండిస్తూ తడి బట్టలతో దేవుడిపై ప్రమాణం చేశాం. మునుగోడులో ఏ సర్వే చూసినా భాజపా గెలుస్తుందని చెబుతోంది. హుజూరాబాద్‌ ఫలితమే మునుగోడులో పునరావృతమవుతుంది. దీంతో కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే కొత్త కుట్రకు తెరలేపారు. డబ్బులకు అమ్ముడు పోయేందుకు సిద్ధమైంది తెరాస ఎమ్మెల్యేలే. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల స్టేట్‌మెట్‌ రికార్డు చేయాలి. కానీ.. పోలీసులు అలా చేయకుండా వారిని వదిలేశారు. గన్‌మెన్లను వదిలేసి ఎమ్మెల్యేలు ఒంటరిగా ఫామ్‌హౌస్‌కు ఎందుకు వెళ్లారు.

3 రోజుల నుంచి ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌లోనే ఎందుకు దాచిపెట్టారు. ఫామ్‌హౌస్‌లో డబ్బులు దొరికాయని ప్రకటించారు.. ఆ డబ్బులు ఏమయ్యాయి. రూ.100 కోట్లు అని ఒకసారి, తర్వాత రూ.15 కోట్లు అని చెప్పారు. ఆ డబ్బు ఏమైంది. నిబద్ధత ఉంటే ఎమ్మెల్యేలు మీడియా ముందుకు రావాలి. దొంగ ఎప్పటికైనా దొరుకుతారు. ఫేక్‌ ఆడియో  విడుదల చేశారు. నిజమైన ఆడియో అయితే ముఖ్యమంత్రి ఊరుకుంటారా? దొంగ ఆడియో రికార్డులు తయారు చేయడానికి వారికి రెండ్రోజులు పట్టింది. నేరస్తులు, ఎమ్మెల్యేల కాల్‌లిస్టు బయట పెట్టాలి. అట్టర్‌ ఫ్లాప్‌ సినామాకు ఐటమ్‌ సాంగ్‌ జోడించినట్టుంది ఈ ఆడియో లీకులు. ముఖ్యమంత్రి నిజమైన హిందువు అయితే.. లక్ష్మీనరసింహస్వామి  సన్నిధి వచ్చి.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో సంబంధం లేదని ప్రమాణం చేయాలి డిమాండ్‌ చేశాం. కానీ.. సీఎం స్పందించలేదు.  పోలీసుల సాయంతో నన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.. అందుకే ఆలస్యంగా యాదాద్రి చేరుకున్నా. ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంకా ఎన్ని రోజులు బరిద్దాం?’’ అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

బండి సంజయ్‌ విమర్శలు తిప్పికొట్టిన మంత్రి జగదీశ్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేయాలంటూ బండి సంజయ్‌ సవాల్‌ చేయడాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి తిప్పికొట్టారు. ప్రమాణం చేసేందుకు బండి సంజయ్‌ కాదు హోం మంత్రి అమిత్‌ షాను పిలవాలని డిమాండ్‌ చేశారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలెందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. బయటపడ్డ దొంగ అంతకు మించి ఏం మాట్లాడతారని విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని