Congress: ఆ ఒక్క ఎమ్మెల్యే తృణమూల్‌లో చేరిక.. బెంగాల్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ మళ్లీ ఖాళీ!

పశ్చిమబెంగాల్‌లో (West Bengal) ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొందిన బేరాన్‌ బిశ్వాస్‌.. తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌లో (TMC) చేరిపోయారు.

Published : 30 May 2023 01:48 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీలో కాంగ్రెస్‌ (Congress) పార్టీకి చుక్కెదురైంది. ఆ పార్టీకి చెందిన బేరాన్‌ బిశ్వాస్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌లో (TMC) చేరిపోయారు. దీంతో బెంగాల్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ మళ్లీ ఖాళీ అయినట్లయ్యింది. రాష్ట్రంలో (West Bengal) కాంగ్రెస్‌కు ఇటీవల ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎన్నికకాగా.. ప్రస్తుతం ఆయన కూడా టీఎంసీలో చేరిపోవడం గమనార్హం.

సాగర్‌దిఘీ నియోజకవర్గానికి మూన్నెళ్ల క్రితం ఉప ఎన్నిక జరిగింది. ఇందులో కాంగ్రెస్‌కు చెందిన బేరాన్‌ బిశ్వాస్‌ ప్రత్యర్థి టీఎంసీపై విజయం సాధించారు. దీంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు పొందని కాంగ్రెస్‌కు.. రాష్ట్ర అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభించినట్లయ్యింది. అయితే, అది మూడు నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. తాజాగా సాగర్‌దిఘీ ఎమ్మెల్యే బేరాన్‌ బిశ్వాస్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ (Abhishek Banerjee) సమక్షంలో తృణమూల్‌ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బిశ్వాస్‌.. తన విజయంలో కాంగ్రెస్‌ పార్టీ పాత్ర లేదని పేర్కొన్నారు.

తృణమూల్‌ కీలక నేత అభిషేక్‌ బెనర్జీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని విమర్శలు గుప్పించారు. జాతీయ స్థాయిలో భాజపాపై పోరాడుతున్నామని చెబుతూనే.. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ను వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని తృణమూల్‌ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలను అభిషేక్‌ బెనర్జీ కొట్టిపడేశారు. తమ పార్టీ మాత్రమే భాజపాకు వ్యతిరేకంగా పోరాడుతోందని ఉద్ఘాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని