Tejashwi Yadav: దేశానికి ఏం అవసరమో.. బిహార్‌ అదే చేసింది: తేజస్వీ

దేశానికి ఏం అవసరమో బిహార్‌ అదే చేసిందని.. దేశానికి తాము ఒక మార్గాన్ని చూపించామని ఆర్జేడీ నేత, బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) అన్నారు. ......

Published : 11 Aug 2022 16:01 IST

పట్నా: దేశానికి ఏం అవసరమో బిహార్‌ అదే చేసిందని.. దేశానికి తాము ఒక మార్గాన్ని చూపించామని ఆర్జేడీ నేత, బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) అన్నారు. తమ యుద్ధం నిరుద్యోగంపైనేనన్నారు. పేదలు, యువత పడుతున్న బాధలు సీఎం నీతీశ్‌కు తెలుసన్నారు. అందుకే యువత, పేదలకు నెల రోజుల్లోపే భారీగా ఉద్యోగాలు కల్పించనున్నట్టు ప్రకటించారు. మహాకూటమి చాలా బలమైందని.. ప్రతిపక్షంలో భాజపా ఒక్కటే మిగిలిందన్నారు. మతపరమైన ఉద్రిక్తతల్ని వ్యాప్తి చేయడంతో పాటు ప్రాంతీయ పార్టీలను కూడా అంతం చేసేందుకు భాజపా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. జేడీ(యు) అధినేత నీతీశ్‌ కుమార్‌ ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకొని మహాకూటమితో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నీతీశ్‌ 8వ సారి సీఎంగా, తేజస్వీ రెండోసారి డిప్యూటీ సీఎంగా నిన్న ప్రమాణస్వీకారం చేశారు.

నేను ఉపరాష్ట్రపతి కావాలనుకున్నానా? వాట్‌ ఏ జోక్‌: నీతీశ్‌ 

మరోవైపు, నీతీశ్‌ను ఉపరాష్ట్రపతి చేయాలంటూ కొందరు జేడీయూ నేతలు తనతో అన్నట్టుగా భాజపా ఎంపీ సుశీల్‌కుమార్‌ మోదీ నిన్న చేసిన ఆరోపణల్ని సీఎం ఖండించారు. ‘‘నేను ఉపరాష్ట్రపతి కావాలనుకున్నట్టు ఓ వ్యక్తి (సుశీల్‌కుమార్‌ మోదీ) అన్నట్టు మీరు విన్నారు. వాట్‌ ఏ జోక్‌. అదంతా అవాస్తవం. అలాంటి కోరికలేమీ నాకు లేవు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మా పార్టీ ఎంతగా మద్దతు ఇచ్చిందో వాళ్లు మరిచిపోయారా?నాకు వ్యతిరేకంగా మాట్లాడనివ్వండి.. వాళ్లకు మళ్లీ పదవులొస్తాయి’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని