BJP: తెలంగాణలో భాజపా ముందస్తు వ్యూహం.. హైదరాబాద్‌లో బస్సు యాత్రకు ప్లాన్‌!

ముందస్తు ఎన్నికల సమాచారం నేపథ్యంలో బస్సు యాత్ర పేరుతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు భాజపా నాయకత్వం కసరత్తు చేస్తోంది.5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసేలోగా ఉత్తర తెలంగాణ జిల్లాల ముఖ్యనేతలతో బండి సంజయ్‌ సమీక్షలు పూర్తి చేయనున్నట్టు సమాచారం.

Published : 05 Dec 2022 01:30 IST

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ త్వరలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో భాజపా రాష్ట్ర నాయకత్వం అందుకు అనుగుణంగా తమ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీని పూర్తిగా సన్నద్ధంగా ఉంచేలా పార్టీ శ్రేణులను సంసిద్దం చేస్తోంది. అదే సమయంలో ముందస్తు ఎన్నికలొస్తే ప్రజా సంగ్రామయాత్ర పరిస్థితి ఏమిటనే అంశంపైనా పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఒక వేళ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే.. పాదయాత్రకు సమయం సరిపోయే అవకాశం లేనందున పాదయాత్రకు బదులుగా బస్సు యాత్ర చేపట్టే అంశంపై కమలదళం కసరత్తు మొదలుపెట్టింది.

జంట నగరాల పరిధిలో 10రోజులు యాత్ర..

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బస్సు యాత్ర పేరుతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు భాజపా నాయకత్వం కసరత్తు చేస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం బండి సంజయ్‌ అతి త్వరలో బస్సు యాత్రకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు ఐదో విడత ప్రజాసంగ్రామయాత్ర ముగిసిన వెంటనే నాలుగు రోజులు విరామం ఇచ్చి 6వ విడత ప్రజాసంగ్రామ యాత్రకు బండి సంజయ్‌ సిద్ధమవుతారని పార్టీ వర్గాల సమాచారం. ఈసారి హైదరాబాద్‌ జంటనగరాల పరిధిలో పాదయాత్ర చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జంటనగరాల పరిధిలో 10 రోజుల పాటు పాదయాత్ర కొనసాగించేలా పాదయాత్ర ప్రముఖ్‌ గంగిడి మనోహర్‌రెడ్డి రూట్‌ మ్యాప్‌ ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

జిల్లాల వారీగా పార్టీ శ్రేణులతో సమీక్షలు..

ప్రజాసంగ్రామయాత్ర 5వ విడత ముగింపు సభ రోజున అధికారికంగా 6వ విడత యాత్ర షెడ్యూల్‌ను వివరించేందుకు యాత్ర నిర్వాహకులు సిద్ధమయ్యారు. పాదయాత్రతో బిజీగా ఉంటున్న బండి సంజయ్‌ మరో వైపు  పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పాదయాత్ర విరామ సమయంలో పార్టీ నేతలతో సమావేశమై జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, పోలింగ్‌ బూత్‌ కమిటీల ఏర్పాటు, పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగా మూడ్రోజుల క్రితం నిర్మల్‌ జిల్లా ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించారు. మండల అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకుల, మోర్చాల అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లా నేతలతో సమావేశమయ్యారు. 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసేలోగా ఉత్తర తెలంగాణ జిల్లాల ముఖ్యనేతలతో సమీక్షలు పూర్తి చేయనున్నట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని