MCD Elections: దిల్లీ ‘మేయర్’ ఎన్నికలో రగడ.. ఆప్‌-భాజపా సభ్యుల మధ్య తోపులాట

దిల్లీ మేయర్ ఎన్నిక తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీసింది. ఎల్‌జీ సక్సేనా చేపట్టిన నియామకాల విషయంలో ఆప్‌, భాజపా మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. 

Updated : 06 Jan 2023 14:55 IST

దిల్లీ: దిల్లీ మేయర్(Delhi Mayor) ఎన్నికలో తీవ్ర రసాభాసా జరిగింది. మేయర్ ఎన్నిక కోసం సమావేశమైన  మున్సిపల్‌ కార్పొరేషన్(MCD Elections) సభ్యుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో కొందరు సభ్యులు నేలపై పడిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. మేయర్ ఎన్నిక నిమిత్తం లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనా భాజపాకు చెందిన సభ్యుడిని ప్రిసైడింగ్ అధికారిగా నియమించారు. ఇది ఆప్‌-భాజపా సభ్యుల మధ్య గందరగోళానికి దారితీసింది. 

దిల్లీ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా సక్సేనా అనేక నియామకాలు చేపట్టారని, మేయర్ ఎన్నికను భాజపాకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆప్‌ ఆరోపించింది. భాజపాకు అనుకూలంగా ఉన్న సభ్యులనే ఉద్దేశపూర్వకంగా నామినేట్‌ చేశారని ఆప్‌ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ విమర్శలు చేశారు. నామినేటెడ్ పదవులకు పేర్లు ప్రకటించిన తర్వాత సక్సేనా.. భాజపా సభ్యుడు సత్యశర్మను ప్రిసైడింగ్ స్పీకర్‌గా నియమించారు. ఆప్‌ ప్రతిపాదించిన సీనియర్ సభ్యుడైన ముకేశ్‌ గోయల్‌ను పక్కనపెట్టి.. శర్మకు తాత్కాలిక పదవి ఇచ్చారు. లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరించిన తీరును ఆప్‌ ఎమ్మెల్యే సౌరభ్‌ భరద్వాజ్‌ ట్విటర్ వేదికగా తప్పు పట్టారు. భాజపా అన్ని ప్రజాస్వామ్య విలువలను, వ్యవస్థలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ గందరగోళానికి ఆప్‌ కారణమని భాజపా నేతలు ఆరోపించారు. ఇరువర్గాలు నినాదాలు చేస్తుండటంతో నిరసనలు కొనసాగాయి. సభ్యుల నినాదాలతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గందరగోళ పరిస్థితులు కొనసాగాయి. దాంతో సభ వాయిదా పడింది. ప్రస్తుతానికి మేయర్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది.

కాగా, డిసెంబర్‌లో జరిగిన దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(MCD Elections) ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించింది. 15 ఏళ్ల భాజపా పాలనను ఆప్‌ ఊడ్చేసింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్‌(126)ను దాటి.. ఆప్‌ 134 స్థానాలకు కైవసం చేసుకుంది. ఆప్‌ తరఫున షెల్లీ ఒబెరాయ్‌(Shelly Oberoi) మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. మొదట ఈ పదవి కోసం తాము పోటీ పడమని చెప్పిన భాజపా.. తర్వాత మాట మార్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని