AAP: టీచర్లకు విదేశాల్లో శిక్షణపై.. భాజపా ‘డర్టీ పాలిటిక్స్‌’ : సిసోదియా

ప్రత్యేక శిక్షణ కోసం ఉపాధ్యాయులను (Teacher Training) విదేశాలకు పంపించేందుకు ఆప్‌ (AAP) ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే.. భాజపా (BJP) మాత్రం వీటిని అడ్డుకుంటూ డర్టీ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా (Manish Sisodia) ఆరోపించారు.

Published : 14 Jan 2023 01:26 IST

దిల్లీ: దేశ రాజధానిలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆమ్‌ఆద్మీ (AAP) ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో శిక్షణ కోసం ఉపాధ్యాయులను విదేశాలకు పంపించే ప్రయత్నాలను భాజపా అడ్డుకుంటోందని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా (Manish Sisodia) ఆరోపించారు. ప్రత్యేక శిక్షణ కోసం ఉపాధ్యాయులను ఫిన్లాండ్‌ (Education in Finland)కు పంపించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే.. భాజపా మాత్రం డర్టీ పాలిటిక్స్‌ (Dirty Politics)కు పాల్పడుతోందని దుయ్యబట్టారు.

‘సింగపూర్‌, ఫిన్లాండ్‌, బ్రిటన్‌ దేశాల్లో ఇప్పటివరకు 1100 దిల్లీ టీచర్లు శిక్షణ పొందారు. 30 మందితో కూడిన మరో బ్యాచ్‌ను ఫిన్లాండ్‌ పంపాలని నిర్ణయించాం. కానీ, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా మాత్రం ఏదో ఒక కారణం చెప్పి అనుమతి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఒకవేళ ఆయన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి విద్యపై ప్రభావం చూపొద్దని భావిస్తే మాత్రం.. భాజపా చేస్తోన్న కుట్రలో భాగస్వామ్యం కావద్దు’ అని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా పేర్కొన్నారు.

‘విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టిన ఉత్తమ ప్రదేశంగా నిలిచిన ఫిన్లాండ్‌కు శిక్షణ కోసం మా ఉపాధ్యాయులను పంపించాం. అటువంటి అంతర్జాతీయ ప్రమాణాలు మా టీచర్లలో ఉండాలని కోరుకుంటున్నాం. విద్యా ప్రమాణాలను పెంచడంతో ఎంతో కీలకంగా వ్యవహరించే టీచర్లకు ఇదెంతో దోహదపడుతుందని భావిస్తున్నాం. కానీ, ఇవన్నీ భాజపాకు తెలియవు. ఎందుకంటే విద్యకు సంబంధించి వారేమీ చేయలేదు. అటువంటి కార్యక్రమం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా అని దిల్లీ ఎల్జీ ప్రశ్నిస్తుండటం విడ్డూరం. అటువంటప్పుడు ప్రధాని, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు వెళ్తారు. ప్రయోజనాల విశ్లేషణ సాకుతో వాటిని కూడా నిలిపివేయాలా..? అని మనీశ్‌ సిసోదియా ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని