BJP: భాజపా కీలక నిర్ణయం.. సీఎంపై పోటీకి మాజీ మిలిటెంట్‌ నేత

మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు భాజపా అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సీఎం కాన్రాడ్‌ సంగ్మాకు పోటీగా మాజీ తీవ్రవాదిని కాషాయ పార్టీ బరిలోకి దించింది.

Published : 03 Feb 2023 02:23 IST

షిల్లాంగ్‌: ఈశాన్య రాష్ట్రం మేఘాలయ (Meghalaya)లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముమ్మర ప్రచారం చేపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాల్లో పోటీ చేసేందుకు భాజపా (BJP) సిద్ధమైంది. అందుకు సంబంధించి అభ్యర్థుల జాబితాను గురువారం విడుదల చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా (Conrad K Sangma)కు పోటీగా మాజీ మిలిటెంట్‌ నేతను కాషాయ పార్టీ బరిలోకి దించింది.

ఈ రాష్ట్రంలో ప్రస్తుతం నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) నేతృత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్‌ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ కూటమిలో భాజపా కూడా మిత్రపక్షంగా ఉంది. అయితే ఈ కూటమి నుంచి తెగదెంపులు చేసుకుని వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని గత నెలలో కాషాయ పార్టీ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 60 స్థానాల్లో భాజపా పోటీ చేయనున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి నేడు వెల్లడించింది.

ఈ క్రమంలోనే నేడు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా (ఎన్‌పీపీ పార్టీ నేత) పోటీ చేస్తున్న దక్షిణ తురా నియోజకవర్గం నుంచి భాజపా(BJP) అభ్యర్థిగా మాజీ మిలిటెంట్‌ నేత, పార్టీ రాష్ట్ర యూనిట్‌ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్‌ ఎన్‌. మారక్‌ (Bernard N Marak)ను నిలబెట్టింది. అసెంబ్లీలో ప్రస్తుతమున్న ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలకు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చారు. వీరితో పాటు ఇటీవల ఇతర పార్టీలకు రాజీనామా చేసి భాజపాలో చేరిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను కూడా కాషాయ పార్టీ బరిలోకి దించింది.

మేఘాలయలో తీవ్రవాద సంస్థ ఏఎన్‌వీసీ(బి)కి బెర్నార్డ్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఇప్పుడు ఈ సంస్థ నిర్వీర్యమైంది. ఆ తర్వాత భాజపాలో చేరిన ఆయన.. తురా గిరిజన మండలి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. రాజకీయంగా ఎదుగుతూ భాజపా రాష్ట్ర యూనిట్ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయనపై అనేక నేరారోపణలు ఉన్నాయి. 25కు పైగా క్రిమినల్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. గతంలో వ్యభిచార గృహం నడుపుతున్న కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలయ్యారు.

మేఘాలయలో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న ఫలితాలను వెల్లడించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని