TSPSC: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ.. మరో ఆందోళనకు సిద్ధమైన భాజపా

నిరుద్యోగులకు మద్దతుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టేందుకు భాజపా సిద్ధమైంది. అందులో భాగంగా ఈనెల 25న ఇందిరాపార్క్‌ వద్ద నిరుద్యోగ మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది.

Published : 22 Mar 2023 16:30 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీపై భాజపా మరో ఆందోళనకు సిద్ధమైంది. ‘మా నౌకరీలు మాగ్గావాలె’ నినాదంతో ఈనెల 25న ఇందిరాపార్క్‌ వద్ద నిరుద్యోగ మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిరుద్యోగ యువతతో కలిసి ధర్నా చేపట్టనుంది. ఈ అంశంపై భాజపా రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో బండి సంజయ్‌ బుధవారం సమావేశమై చర్చించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ, మీడియా సంస్థలపై దాడులు, జర్నలిస్టుల అరెస్ట్‌ వంటి అంశాలపై చర్చించారు.

రాష్ట్రంలోని 30లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నందున వారికి మద్దతుగా వివిధ రూపాల్లో పోరాట కార్యక్రమాలు నిర్వహించేందుకు భాజపా ప్లాన్‌ చేస్తోంది. సాగరహారం, మిలియన్‌ మార్చ్‌ వంటి అంశాలపైనా చర్చించారు. తొలుత ఈనెల 25న ఇందిరాపార్క్‌ వద్ద నిరుద్యోగ మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలో సీఎం కేసీఆర్‌ కుమారుడి పాత్ర ఉన్నందున వెంటనే ఆయనను బర్తరఫ్‌ చేయాలని, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలనే ప్రధాన డిమాండ్లతో నిరుద్యోగ మహాధర్నా చేపట్టాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని బండి సంజయ్‌ పార్టీ నేతలను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని