తిరుమలలో అన్యమత ప్రచారానికి అడ్డుకట్ట వేస్తాం!

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఆధీనం నుంచి దేవాలయాలను తొలగించటం, తిరుపతి లోక్ సభ

Published : 12 Apr 2021 01:20 IST

భాజపా-జనసేన కూటమి మేనిఫెస్టో విడుదల

తిరుపతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఆధీనం నుంచి దేవాలయాలను తొలగించటం, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుతో పాటు పలు అంశాలతో కూడిన ప్రత్యేక మేనిఫెస్టోను భాజపా-జనసేన కూటమి విడుదల చేసింది. ఆదివారం తిరుపతిలో నిర్వహించిన భాజపా-జనసేన సంయుక్త మీడియా సమావేశంలో లోక్‌సభ ఉపఎన్నిక నేపథ్యంలో ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు ఇరుపార్టీలు ప్రకటించాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజ్యసభ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, టీజీ వెంకటేష్, భాజపా ఎంపీ అభ్యర్థి రత్నప్రభ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై మేనిఫెస్టోను విడుదల చేశారు.

ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. తితిదే ఆస్తులను విక్రయించాలని వైకాపా ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందన్నారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని పవిత్రతను పరిరక్షించే విధంగా తమ మేనిఫెస్టో రూపొందించామన్నారు. తిరుపతి రూపు రేఖలు మార్చే అద్భుతమైన మేనిఫెస్టోకు ఇరుపార్టీల నేతలు, మేధావులు కలిసి రూపకల్పన చేశారని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. 48కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో భక్తకన్నప్ప పాఠశాలలు, ప్రతీ ఇంటికీ తాగునీటి సరఫరానిచ్చేలా ‘జలమే జీవనం పథకం’ కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు, పులికాట్ సరస్సులో మత్స్యకారుల సంక్షేమం కోసం ఆంధ్రా- తమిళనాడుల మధ్య సరిహద్దుల రీ-సర్వే, పూడికతీత పనులు వంటి అనేక ప్రజా ప్రయోజన అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు.

మేనిఫెస్టోలోని ఇంకొన్ని అంశాలు

* తితిదేను ధర్మాచార్యుల పర్యవేక్షణలోకి తీసుకురావడం.

* తిరుమలలో అన్యమత ప్రచారానికి అడ్డుకట్ట వేయడం.

* తిరుపతిలో శరభయ్య విగ్రహం ఏర్పాటు

* రూ.48కోట్లతో భక్తకన్నప్ప పేరు మీద ఏకలవ్య పాఠశాలలు

* ప్రతి రైతుకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు, రూ.2లక్షల రుణ సౌకర్యం

* పాడి, గొర్రెల రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ ద్వారా రుణాలు

* పులికాట్‌ సరస్సులో పూడికతీత పనులు

* తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కొత్త బోధనాసుపత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని