రాజకీయ ప్రత్యర్థులను తెరాస అణచివేస్తోంది: గవర్నర్‌కు భాజపా ఫిర్యాదు

రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా వ్యవహారిస్తోందని భాజపా రాష్ట్ర నాయకులు ధ్వజమెత్తారు.

Updated : 20 Apr 2022 14:18 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా వ్యవహరిస్తోందని భాజపా రాష్ట్ర నాయకులు ధ్వజమెత్తారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ భాజపా కార్యకర్తలను అణచి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు భాజపా రాష్ట్ర ప్రతినిధుల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. భాజపా నేతలు రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డిలతో కూడిన ప్రతినిధుల బృందం ఖమ్మం, రామాయంపేట ఆత్మహత్యల ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు.

ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ హత్యలు, పోలీసుల ప్రవర్తనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. ప్రతిపక్ష నాయకులను కౌన్సెలింగ్ పేరుతో హింసిస్తున్నారు. రాష్ట్ర పోలీసులు విచారణ జరిపితే నిష్పక్షపాతంగా జరగదు. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరాం. ఖమ్మంలో సాయి గణేశ్‌, కామారెడ్డిలో సంతోష్, పద్మల ఆత్మహత్యలపైన సీబీఐతో విచారణ జరిపించాలి’’ అని అన్నారు. 

రాజకీయ ప్రత్యర్థులను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని రామచందర్‌రావు అన్నారు. ‘‘అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. భాజపా కార్యకర్తలను అణిచి వేస్తున్నారు. భాజపాపై తెరాస దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. పువ్వాడ అజయ్‌పై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. అజయ్ రాజీనామా చేయకపోతే ప్రభుత్వం బర్తరఫ్‌ చేయాలి’’ అని రామచందర్‌రావు డిమాండ్‌ చేశారు. 

పోలీసులు తెరాస కార్యకర్తల్లా పని చేస్తున్నారని పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ‘‘సాయిగణేశ్‌ ఆత్మహత్య వ్యవహారంలో పువ్వాడ అజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఖమ్మం, రామాయంపేట ఘటనలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరాం. కేసీఆర్ రాజ్యాంగం పేరుతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు’’ అని సుధాకర్‌రెడ్డి ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని