MP Laxman: ఎగ్జిట్ పోల్స్‌ను కాదు.. పీపుల్స్ పోల్స్‌ను నమ్ముతాం: ఎంపీ లక్ష్మణ్

జేపీఎస్‌ల సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated : 11 May 2023 15:39 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పాలన పడకేసిందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ విమర్శించారు. ప్రజా సమస్యలపై కాకుండా అనసవర రాజకీయాలపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారని అసహనం వ్యక్తం చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్‌) వాళ్ల హక్కుల కోసం పోరాడుతుంటే బెదిరింపులతో సమ్మెను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. జేపీఎస్‌లను ఉద్యోగాల నుంచి తీసివేస్తామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేపీఎస్‌ల సమస్యలను తక్షణమే పరిష్కరించి.. రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

‘‘ఐదు వేలకు పైగా వీఆర్వోలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తే వీఆర్వో వ్యవస్థనే లేకుండా చేశారు. ఆర్టీసీ సమ్మెపైనా ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకు అందించే పరిహారం విషయంలో ముఖ్యమంత్రికి సమీక్ష చేసే తీరిక లేకపోవడం చూస్తే.. అన్నదాతల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోంది. 

రాష్ట్రంలో రైతులు పంట నష్టపోయి ఇబ్బందులు పడుతుంటే.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్‌ అంటా దేశమంతా తిరుగుతున్నారు. ప్రచారం కోసం రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టేందుకు భారాస సర్కారు సిద్ధంగా ఉంది తప్ప.. రైతుల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేదు. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలి. దేశంలో ఎక్కడేమి జరిగినా దాని మూలాలు హైదరాబాద్‌తో ముడిపడి ఉంటున్నాయి. ఇది తెలంగాణ రాష్ట్ర భద్రతకు ముప్పుగా వాటిల్లే ప్రమాదం ఉంది’’ లక్ష్మణ్‌ తెలిపారు.

మరోవైపు కర్ణాటక ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌పైనా లక్ష్మణ్‌ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్‌ను ఆయన నమ్మడం లేదని.. పీపుల్స్ పోల్స్‌ను మాత్రమే నమ్ముతామని తెలిపారు. కర్ణాటకలో భాజపా ప్రభుత్వం ఏర్పడుతుందనే విశ్వాసం తనకు ఉందని చెప్పారు. మోదీ నాయకత్వాన్ని కర్ణాటక ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని