‘రాహుల్‌ ఒక వలసనేత’

తమ కుటుంబానికి కంచుకోటైన అమేథీలో పరాజయం పాలైన రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారని భాజపా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రల్‌హాద్‌ జోషి అన్నారు. రాహుల్‌ ఒక వలసనేత అని ఆయన విమర్శించారు.

Updated : 17 Feb 2021 05:33 IST

విమర్శలు గుప్పించిన భాజపా

త్రిసూర్‌: కంచుకోట అయిన అమేఠిలో పరాజయం పాలైన రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారని భాజపా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. రాహుల్‌ ఒక వలసనేత అని ఆయన విమర్శించారు. కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో మహిళల ప్రవేశ అంశంపై మంత్రి మాట్లాడుతూ రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ రాష్ట్ర, జాతీయ నాయకత్వాల మధ్య సమన్వయం లోపించిందన్నారు. ఈ విషయంపై రాహుల్‌ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన సూచించారు.

కేరళ భాజపా ఎన్నికల ఇంఛార్జ్‌గా ఉన్న ప్రహ్లాద్‌ జోషి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 21న కేరళలో విజయ యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ‘‘రాహుల్‌ గాంధీ తన నియోజకవర్గమైన అమేఠీలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. అక్కడి ప్రజలు తిరస్కరించడంతో వయనాడ్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే వారికి ఏ అభివృద్ధి జరగదని కేరళ ప్రజలకు తెలుసు.’’ అని ప్రహ్లాద్‌ తెలిపారు. శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీం ఇచ్చిన తీర్పును రాహుల్‌ సమర్థించగా, కేరళ కాంగ్రెస్‌ నాయకులు దానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ఈ అంశంపై రాహుల్‌ స్పందించాలని  జోషి సవాలు చేశారు. ఫిబ్రవరి 21న ప్రారంభమయ్యే విజయ యాత్రను ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రారంభిస్తారని ప్రహ్లాద్‌ తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మార్చి7న తిరువనంతపురంలో ఈ యాత్రలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు