Rahul Gandhi: మోదీజీ దేవుడికే పాఠాలు చెప్పగలరు.. అమెరికాలో రాహుల్‌ వ్యంగ్యాస్త్రాలు

విదేశీ గడ్డపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మరోసారి ప్రధాని మోదీ (Modi)పై విమర్శలు గుప్పించారు. ఆయన దేవుడికే పాఠాలు నేర్పించగలరంటూ ఎద్దేవా చేశారు.

Updated : 31 May 2023 14:22 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికా (USA) పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi).. భాజపా (BJP) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కారు భారత ప్రజలను భయపెడుతోందని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. ఇక, ప్రధాని మోదీ (PM modi).. దేవుడికే పాఠాలు చెప్పే ఘనుడంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలతో రాహుల్‌ (Rahul Gandhi) చర్చా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాజపా ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS), ప్రధాని మోదీ (Modi)పై విమర్శల వర్షం కురిపించారు. ‘‘అంతా తమకే తెలుసు అని ప్రజలను నమ్మించే వ్యక్తులు భారత్‌లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. వారు శాస్త్రవేత్తలకే శాస్త్రాన్ని చెబుతారు. చరిత్రకారులకు చరిత్రను వివరిస్తారు. సైన్యానికి యుద్ధాన్ని నేర్పిస్తారు. వారు దేవుడితో కూర్చుంటే ఆయనకే వివరించగల సమర్థులు. ప్రధాని నరేంద్ర మోదీ అందుకు గొప్ప ఉదాహరణ. ఒకవేళ.. మోదీ ఆ భగవంతుడి పక్కన కూర్చుంటే.. ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందని దేవుడికే చెప్పగలరు. అప్పుడు భగవంతుడు కూడా తాను సృష్టించిన విశ్వం ఇదేనా అని గందరగోళానికి గురవుతారు’’ అంటూ రాహుల్‌ ఎద్దేవా చేశారు.

అందుకే జోడో యాత్ర..

‘‘భాజపా (BJP) ప్రజలను భయపెడుతోంది. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. ప్రజలతో మమేకమయ్యేందుకు అవసరమైన అన్ని సాధనాలను భాజపా-ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రించింది. ఒకప్పటి రాజకీయ వ్యూహాలు ఇక పనిచేయవని అర్థమైంది. అందుకే భారత్‌ జోడో యాత్రను చేపట్టా. నా యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించింది. కానీ అవి ఫలించలేదు. మా యాత్రకు మరింత ఆదరణ దక్కింది. ఆ ప్రయాణంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా’’ అని రాహుల్ (Rahul Gandhi) వివరించారు.

అలాగైతే భాజపాను ఓడించగలం..

‘‘ప్రతిపక్షాలన్నీ సరిగ్గా ఏకమైతే భాజపా కచ్చితంగా ఓడిపోతుంది. కర్ణాటక ఎన్నికలే అందుకు ఉదాహరణ. విపక్షాల ఐక్యత కోసం మేం చర్యలు తీసుకుంటున్నాం. అయితే కేవలం ఐక్యత మాత్రమే సరిపోదు.. ప్రత్యామ్నాయ వ్యూహాలు కూడా అవసరం’’ అని రాహుల్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఇక, ప్రపంచ మీడియాలో చూపించినట్లుగా భారత్‌లో పరిస్థితులు లేవని రాహుల్‌ ఆరోపించారు. అదంతా రాజకీయ ప్రచారమే అని కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. వాస్తవంలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయన్నారు.

వారం రోజుల పర్యటన నిమిత్తం రాహుల్‌ గాంధీ మంగళవారం అమెరికా (America) చేరుకున్నారు. ‘మొహబత్‌ కి దుకాణ్‌ (ప్రేమ దుకాణాలు)’ పేరుతో కాలిఫోర్నియాలో ఆయన ఈ కార్యక్రమం నిర్వహించారు. వాషింగ్టన్‌, న్యూయార్క్‌లోనూ రాహుల్‌ పర్యటించనున్నారు. అక్కడి ప్రవాసభారతీయులతో ఆయన ముచ్చటించనున్నారు. అమెరికా చట్టసభ ప్రతినిధులు, ఇతర రంగాల ప్రముఖులతో ఆయన చర్చలు జరపనున్నారు. జూన్‌ 4న న్యూయార్క్‌లోని మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నట్లు కాంగ్రెస్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని