BJP: ప్రతి నియోజకవర్గంలో 1000 మంది ప్రముఖులతో.. భాజపా ‘లోక్‌సభ’ ప్లాన్‌

Maha Jansampark Abhiyan: తొమ్మిదేళ్ల పాలనలో కేంద్రంలో భాజపా (BJP) సర్కారు అమలుచేసిన పథకాలు, కార్యక్రమాల గురించి ఇంటింటికీ తెలియజేయడమే లక్ష్యంగా భాజపా ప్రత్యేక ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రముఖ వ్యక్తులను కాషాయ నేతలు కలవనున్నారు.

Published : 30 May 2023 18:36 IST

ముంబయి: వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (BJP) ఇప్పటినుంచే వ్యూహాలు అమలు చేస్తోంది. కేంద్రంలో భాజపా ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘మహా జన్‌సంపర్క్‌ అభియాన్‌ (Maha Jansampark Abhiyan)’ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగానే బుధవారం నుంచి ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో 1000 మంది ప్రముఖ వ్యక్తులను భాజపా నేతలు ప్రత్యేకంగా కలవనున్నట్లు పార్టీ నేత ఒకరు మంగళవారం వెల్లడించారు.

ఈ ప్రచార కార్యక్రమం గురించి భాజపా (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే (Vinod Tawde) మీడియాతో మాట్లాడారు. ‘‘దేశవ్యాప్తంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న 1000 మంది ప్రముఖ వ్యక్తుల (eminent persons) జాబితాను సిద్ధం చేశాం. పద్మ అవార్డులు, రాష్ట్రపతి పతకాలు వంటి పురస్కారాలు సాధించిన వారు ఈ జాబితాలో ఉన్నారు. వీరందరికీ కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు కలిసి భాజపా విజయాలను వారికి వివరిస్తారు. మొత్తంగా 543 లోక్‌సభ నియోజవర్గాల్లో మే 31 నుంచి జూన్‌ 30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే దాదాపు 5.5లక్షల మందితో మా నేతలు సమావేశమవుతారు’’ అని తావ్డే వివరించారు.

ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) నేతృత్వంలో గడిచిన 9 ఏళ్లలో భాజపా సర్కారు సాధించిన విజయాలతో పాటు, లోక్‌సభ నియోజవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి నేతలు వారికి వివరిస్తారని తావ్డే తెలిపారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 10 కీలక సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను నియోజకవర్గాల వారీగా సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ లబ్ధిదారులతో స్థానికంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

తొమ్మిదేళ్ల పాలనలో కేంద్రంలో భాజపా సర్కారు అమలుచేసిన పథకాలు, కార్యక్రమాల గురించి ఇంటింటికీ తెలియజేయడమే లక్ష్యంగా ఈ మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జూన్‌ 30 వరకు జరిగే ఈ కార్యక్రమాలు, నిర్వహించే సభల్లో ప్రధాని మోదీతో పాటు పార్టీ అగ్రనేతలు, కేంద్రమంత్రులు పాల్గొననున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని