మా పార్టీని భాజపా బానిసలా చూసింది: రౌత్‌

గత సంకీర్ణ ప్రభుత్వంలో శివసేనను భారతీయ జనతా పార్టీ బానిసలా చూసిందని, ఒకానొక దశలో పార్టీని పూర్తిగా నాశనం చేయాలని కుట్ర చేసిందని శివసేన ఎంపీ సంజయ్‌..

Published : 13 Jun 2021 15:53 IST

ముంబయి: గత సంకీర్ణ ప్రభుత్వంలో శివసేనను భారతీయ జనతా పార్టీ బానిసలా చూసిందని, ఒకానొక దశలో పార్టీని పూర్తిగా నాశనం చేయాలని కుట్ర చేసిందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. 2014-19 మధ్య భాజపా నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ శివసేన కార్యకర్తల సమావేశంలో ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘గత ప్రభుత్వంలో శివసేన రెండో స్థానంలో ఉంది. ఆ సమయంలో భాజపా శివసేనను ఓ బానిసలా చూసింది. శివసేన మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతూ పార్టీని అంతం చేసేందుకు పలుమార్లు ప్రయత్నాలు చేసింది’’ అని రౌత్‌ అన్నారు. తమకు ఏమీ దక్కలేదన్న శివ సైనికుల నిరాశ, నిస్పృహల నుంచి మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం (శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌) ఏర్పాటైందన్నారు. ఇప్పుడు అధికారం శివసేన చేతిలో ఉందన్నారు. ఎన్నికల అనంతరం 2019 నవంబర్‌లో దేవేంద్ర ఫడణవీస్‌తో ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ చేతులు కలిపారని, కొన్ని గంటల్లో కూటమిలో భాగమైన ఆ వ్యక్తి.. ఇప్పుడు ఉద్ధవ్‌తో కలిసి మెలిసి పనిచేస్తున్నారని గుర్తుచేశారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని చెప్పుకొచ్చారు.

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో విభేదాల కారణంగా భాజపాతో బంధానికి కటీఫ్‌ చెప్పిన శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, మోదీ ఈ దేశంలోనే అగ్రనాయకుడు అంటూ ఇటీవల రౌత్‌ ప్రశంసించడం చర్చనీయాంశమైంది. ప్రధానితో ఉద్ధవ్‌ భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు రావడం చర్చకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో భాజపాపై రౌత్‌ విమర్శలు చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని