అవినీతి లేని పుదుచ్చేరిని నిర్మిస్తాం: నడ్డా

పుదుచ్చేరిలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో భాజపా అధికారంలోకి వస్తే అవినీతి రహితంగా తీర్చిదిద్దడమే కాకుండా..  అభివృద్ధి పథంలోనూ నడిపిస్తామని హామీ ఇచ్చారు.

Published : 01 Feb 2021 01:25 IST

పుదుచ్చేరి: పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో భాజపా అధికారంలోకి వస్తే అవినీతి రహితంగా తీర్చిదిద్దడమే కాకుండా..  అభివృద్ధి పథంలోనూ నడిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు నడ్డా ఆదివారం పుదుచ్చేరిలో నిర్వహించిన తొలి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. పుదుచ్చేరిలో సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అవినీతి బాగా పెరిగిపోయిందని విమర్శలు చేశారు. 

‘‘కాంగ్రెస్‌ పార్టీ 35 ఏళ్ల పాలనలో ఇక్కడ దాదాపు 52శాతం మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు. అవినీతి కారణంగానే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో పుదుచ్చేరికి కేంద్రం నుంచి 70శాతం నిధులు మంజూరు చేయగా.. నారాయణ స్వామి కేంద్రమంత్రిగా పనిచేసినప్పుడు దాన్ని 30శాతానికి తగ్గించారు. అంతేకాకుండా ఆయన కేంద్ర పదవిలో ఉన్నప్పుడు ఝార్ఖండ్‌ రాష్ట్రానికి రూ.5వేల కోట్లు రుణమాఫీలు చేశారు. కానీ పుదుచ్చేరి కోసం ఏ మాత్రం పనిచేయలేదు. పుదుచ్చేరిలో కమలం వికసించబోతోంది. ఇక్కడ త్వరలో జరగబోయే ఎన్నికల్లో దాదాపు 23 స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుంది. మేం ‘వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ కార్డు’ విధానాన్ని తీసుకువచ్చినప్పుడు.. పుదుచ్చేరిలో అసలు రేషన్‌ దుకాణాలే తెరుచుకోవడం లేదనే విషయాన్ని గుర్తించాం’’ అని అధికార కాంగ్రెస్‌పై నడ్డా మండిపడ్డారు. పుదుచ్చేరికి ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి

వూహాన్‌ మార్కెట్లో కరోనా మూలాల శోధన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని