Farooq Abdullah: ‘ఆ పంచాయతీ ఎన్నికల్ని బహిష్కరించడం పెద్ద తప్పిదమే..!’

జమ్మూ- కశ్మీర్‌లో 2018 పంచాయతీ ఎన్నికలను బహిష్కరించడం తాము చేసిన పెద్ద తప్పిదమని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా(Farooq Abdullah) వ్యాఖ్యానించారు. ఇకముందు స్థానికంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. తమ పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందన్నారు.

Published : 06 Dec 2022 01:05 IST

శ్రీనగర్‌: జమ్మూ- కశ్మీర్‌లో 2018 పంచాయతీ ఎన్నికల్ని బహిష్కరించడం తాము చేసిన పెద్ద తప్పిదమని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా(Farooq Abdullah) వ్యాఖ్యానించారు. ఇకముందు స్థానికంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. తమ పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందన్నారు. అయితే, ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం, భద్రతా దళాలు మాత్రం జోక్యం చేసుకోవద్దంటూ హెచ్చరించారు.

‘పార్టీ(National Conference) శ్రేణులకు ఒక్కటే చెబుతున్నా. అప్పట్లో (2018లో) పంచాయతీ ఎన్నికలను బహిష్కరించడం పెద్ద తప్పిదం. భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికలనూ బహిష్కరించం. అందుకు బదులుగా పోటీ చేసి గెలుస్తాం’ అని ఫరూక్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేతగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన.. సోమవారం పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.

జమ్మూ- కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నంత కాలం తాను ఎన్నికల్లో పోటీ చేయనంటూ కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా చేసిన ప్రకటనపై స్పందించిన ఆయన.. ‘పార్టీ అధ్యక్షుడిగా చెబుతున్నా. నువ్వు(ఒమర్‌ అబ్దుల్లా) ఎన్నికల్లో నిలబడాల్సిందే’ అని స్పష్టం చేశారు. ప్రత్యర్థులను ఓడించాలంటే.. పార్టీ శ్రేణులంతా రంగంలోకి దూకి, ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుందన్నారు.

ఎన్నికలు, అధికారం విషయంలో భాజపా ఏదైనా చేస్తుందని ఆరోపించిన ఫరూక్‌.. పార్టీ విధేయులనూ కొనే ప్రయత్నం చేస్తుందన్నారు. అయినప్పటికీ.. వారి ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో భద్రతా బలగాలు, ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని చెబుతూ.. ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకునే అధికారం ప్రజలకే ఇవ్వాలన్నారు. ఒకవేళ అలాంటిదే జరిగితే ఆందోళనలు చేపడతామని, ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు