cabinet: మోదీ టీమ్‌లో ఇతడే చిన్నోడు

గల్లీ నుంచి దిల్లీ వరకు ఆయన రాజకీయ ప్రస్థానం ఇలా...

Updated : 08 Jul 2021 05:07 IST

 35ఏళ్లకే కేంద్రమంత్రిగా నిషిత్‌ ప్రామాణిక్‌ 

దిల్లీ: ఒకప్పుడు తలపండిన రాజకీయ నాయకులే కేంద్రమంత్రులుగా ఉండేవారు. ప్రస్తుతం ఆ భావన పూర్తిగా మారిపోతోంది. ప్రతిభ ఉంటే చాలు వయసుతో సంబంధం లేదు. అందుకు నిదర్శనం బుధవారం కొత్తగా నియమితులైన కేంద్ర మంత్రుల్లో పశ్చిమబెంగాల్‌కి చెందిన 35ఏళ్ల నిషిత్‌ ప్రామాణిక్. చిన్న వయస్సులోనే కేంద్రమంత్రి వర్గంలో చోటు సంపాదించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. నిషిత్‌ ప్రామాణిక్‌కు హోం, యువజన, క్రీడాశాఖ సహాయ మంత్రిగా అవకాశం కల్పించారు. గల్లీ నుంచి దిల్లీ వరకు ఆయన రాజకీయ ప్రస్థానం ఇలా...

పశ్చిమబెంగాల్‌లోని దిన్‌హతాలో జనవరి 17, 1986లో జన్మించారు నిషిత్‌‌. బాలకూర జూనియర్‌ బేసిక్‌ స్కూల్‌ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచ్‌లర్స్‌ పట్టా పొందారాయన. ప్రారంభంలో ఓ ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్‌ టీచర్‌గా పనిచేసి.. ఆపై తృణమూల్‌ కాంగ్రెస్‌లో యూత్‌ లీడర్‌గా సేవలందించారు. అనంతరం 2019లో భాజపాలో చేరారు. పశ్చిమబెంగాల్‌లోని కోచ్‌ బిహార్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు.

టీఎంసీపై స్వత్రంత్రులను దింపి..
అది 2018.. బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు. అధికార పార్టీని ఢీకొట్టి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం మామూలు విషయం కాదు. అలాంటి పరిస్థితుల్లో నిషిత్‌ తనదైన రాజకీయ వ్యూహాలతో రంగంలోకి దిగాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 300 మందికి పైగా స్వతంత్ర అభ్యర్థులను టీఎంసీకి పోటీగా నిలిపి, వారిలో అత్యధిక మంది విజయం సాధించేలా చేశాడు. 

2019లో భాజపాలోకి ఎంట్రీ
2019 ఫిబ్రవరిలో కాషాయతీర్థం పుచ్చుకున్న నిషిత్‌ ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా టికెట్‌ దక్కించుకున్నాడు. కోచ్‌ బిహార్‌లో టీఎంసీకి ప్రాబల్యం ఎక్కువ. అయినా కూడా లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తా చాటారు నిషిత్‌. టీఎంసీ అభ్యర్థి చంద్రా అధికారిపై సుమారు 54వేల ఓట్ల తేడాతో విజయ ఢంకా మోగించారు. అయితే, ఈ ఏడాది జరిగిన పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసిన నిషిత్‌ దిన్హతా నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలుపొందారు. అయితే పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తాజాగా కేంద్ర మంత్రిగా పదవీ ప్రమాణం చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని