Kalvakuntla kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు

దిల్లీ మద్యం కేసు(Delhi liquor case)లో విచారించేందుకు ఎమ్మెల్సీ కవిత (Kalvakuntla kavitha) ఇంటికి సీబీఐ (CBI) అధికారులు చేరుకున్నారు. రెండు బృందాల్లో వచ్చిన సీబీఐ అధికారులు.. కేవలం సాక్షిగా మాత్రమే కవిత వివరణను నమోదు చేయనున్నారు.

Updated : 11 Dec 2022 12:34 IST

హైదరాబాద్‌: దిల్లీ మద్యం కేసు(Delhi liquor case)లో విచారించేందుకు ఎమ్మెల్సీ కవిత (Kalvakuntla kavitha) ఇంటికి సీబీఐ (CBI) అధికారులు చేరుకున్నారు. రెండు బృందాల్లో వచ్చిన సీబీఐ అధికారులు.. కేవలం సాక్షిగా మాత్రమే కవిత వివరణను నమోదు చేయనున్నారు. సీఆర్‌పీసీ 160 కింద ఆమె వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు. విచారణకు వచ్చిన సీబీఐ బృందంలో మహిళా అధికారులు కూడా ఉన్నారు. సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశముంది. 

ఈ కేసులో కవిత విచారణ కోసం ఆరో తేదీని సూచిస్తూ సీబీఐ మొదట లేఖ రాయగా... ఆ రోజు తనకు ఇతర కార్యక్రమాలున్నాయని 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని ఆమె ప్రత్యుత్తరం రాశారు. దీంతో సీబీఐ ఆదివారం (నేడు) విచారిస్తామని సమాచారం ఇవ్వగా, కవిత అంగీకరించారు. 

మరోవైపు ఆమె శనివారం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌(CM KCR)ను కలిశారు. మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత కవితతో సీఎం మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజకీయకక్షతో ఇబ్బందులు పెట్టేందుకు భాజపా ఎన్ని ప్రయత్నాలు చేసినా... అవి ఫలించవని, సీబీఐ విచారణ దానిలో భాగమేనని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. సీబీఐకి ధైర్యంగా సమాధానాలు చెప్పాలని సూచించినట్లు తెలిసింది. ఈ విషయంలో ఇప్పటికే కవిత పలువురు న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నట్లు సమాచారం. పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ తమ ఇంటికి రావద్దని కవిత వారిని కోరారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం వద్ద భారాస (BRS) నేతలు భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగులు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌.. విల్‌ నెవర్‌ ఫియర్‌ (యోధుని కుమార్తె..ఎన్నటికీ భయపడదు) అని వాటిపై రాశారు. సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత ఇంటి మార్గంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని