
అధిక ద్రవ్యోల్బణానికి కేంద్రమే కారణం..!
దిల్లీ: దేశంలో అధిక ద్రవ్యోల్బణానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, అసమర్థ ఆర్థిక వ్యవస్థ నిర్వహణే కారణమని కాంగ్రెస్ అగ్రనేత పి.చిదంబరం ఆరోపించారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరల పెరుగుదలకు సంబంధించి కేంద్ర సర్కారు విధానాలను ఆయన ఎండగట్టారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దిగుమతి సుంకాలను సమీక్షించాలన్నారు. దిగుమతి చేసుకుంటున్న నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని కోరారు. పలు వస్తువులకు సంబంధించి జీఎస్టీ రేటును తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలపై సర్కారు నిర్లక్ష్యాన్నికాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
జాతీయ గణాంకాల కార్యాలయం ఇటీవల విడుదల చేసిన నివేదికను ఈ సందర్భంగా చిదంబరం ప్రస్తావించారు. దేశంలో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణాన్ని 6.26 శాతంగా ఆ నివేదికలో పేర్కొన్నట్లు గుర్తు చేశారు. కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో ఈ స్థాయి ద్రవ్యోల్బణం ప్రజల నడ్డి విరుస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని ప్రభుత్వం, ఆర్బీఐ 4 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించాయన్నారు. కానీ వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం గరిష్ఠ పరిమితిని దాటిందని వివరించారు. ‘‘సాధారణ పరిస్థితుల్లోనే ద్రవ్యోల్బణం భరించలేని అంశం. కానీ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. నిరుద్యోగం 8.1 శాతానికి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఏం తినాలో.. ఎలా జీవనం సాగించాలో చెబుతారా?’’ అంటూ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
దిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.100 దాటింది. డీజిల్ ధరలు కాస్త తగ్గి రూ.89.72 కి చేరింది. లీటరు పెట్రోలు ధర ముంబయిలో రూ.107.20 కాగా.. డీజిల్ ధర రూ.97.29 వద్ద నిలిచింది. భోపాల్లో లీటరు పెట్రోలు రూ.109.53 కాగా.. డీజిల్ ధర రూ.98.50కి చేరింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.