Andhra News: ఎయిమ్స్ కోసం వైకాపా ఏం చేసిందో చెప్పగలరా?: చంద్రబాబు

వైద్యరంగంపై సీఎం జగన్ తప్పుడు ప్రకటన చేయడం మానుకొని.. తొలుత ఎయిమ్స్‌లో నెలకొన్న

Published : 26 Sep 2022 17:36 IST

అమరావతి: వైద్యరంగంపై సీఎం జగన్ తప్పుడు ప్రకటనలు మానుకొని.. తొలుత ఎయిమ్స్‌లో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్‌కు కనీస నీటి సరఫరా చేయలేని ప్రభుత్వాన్ని ఏమనాలని మండిపడ్డారు. అతి తక్కువ ధరలో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రికి నీళ్లివ్వలేనందుకు ప్రభుత్వం సిగ్గు పడాలని ఆక్షేపించారు. ఈ మూడున్నరేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం ఎయిమ్స్ కోసం ఏం చేసిందో చెప్పగలదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

తెలుగుదేశం హయాంలో ఎయిమ్స్‌కు భూములు ఇచ్చి, వసతులు కల్పించి వైద్య సేవల నిమిత్తం ప్రతిష్ఠాత్మక సంస్థను సిద్ధం చేశామని చంద్రబాబు తెలిపారు. అటువంటి సంస్థ పెరిగిన తమ అవసరాల కోసం అదనంగా నీటి వనరులను సమకూర్చాలని లేఖలు రాసినా పరిష్కరించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజ్‌లు అన్నీ తామే తెచ్చామని అసెంబ్లీలో సైతం అసత్యాలు పలికిన సీఎం.. తానుంటున్న మున్సిపాలిటీ నుంచి ఆసుపత్రికి నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. స్వయంగా కేంద్ర మంత్రులు సైతం నీటి వసతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా సీఎం స్పందించలేదని.. పైగా వైద్య రంగంలో సమూల మార్పులు తన వల్లే జరిగాయని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జగన్‌రెడ్డి చేతగానితనం లక్షల మంది ప్రజలకు శాపంగా మారకూడదని హితవు పలికారు. ప్రభుత్వం వెంటనే ఎయిమ్స్‌కు అవసరమైన అన్ని అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని