CBN on AP Govt: 3 గంటల్లో బెడ్‌ ఎక్కడైనా ఇస్తున్నారా?: చంద్రబాబు 

రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 25.9 శాతానికి చేరిందని..

Published : 29 Apr 2021 01:12 IST

జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డ చంద్రబాబు

అమరావతి : రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 25.9 శాతానికి చేరిందని.. ప్రభుత్వ అసమర్థ చర్యలతో ప్రజలు చనిపోతున్నారని మండిపడ్డారు. కరోనాకు సంబంధించి కోర్టులకు కూడా తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు.

అది అంతా అబద్ధం..

‘కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చామని చెబుతున్నారు. అది అంతా అబద్ధం. ప్రభుత్వ జీవోలు ఎక్కడా అమలు కావట్లేదు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. అందరినీ కలుపుకొనిపోయి ప్రజల ప్రాణాలు కాపాడాలి. ప్రజల ప్రాణాలు హరించి శ్మశానాలకు రాజులుగా ఉండాలనుకుంటున్నారా? మిగతా రాష్ట్రాల కంటే ముందే ఏపీలో మద్యం దుకాణాలు తెరిచారు. థియేటర్లు, రెస్టారెంట్లు సహా అన్నీ తెరిచారు. మృతదేహాలను మోటార్‌ సైకిల్‌పై తీసుకెళ్లాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొంది’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

దేశమంతా పరీక్షలు వాయిదా వేస్తే..

‘రాష్ట్రంలో 3 గంటల్లో బెడ్‌ ఇస్తామని ప్రకటించారు. ఎక్కడైనా ఇస్తున్నారా? వెంటిలేటర్‌ బెడ్‌కు రూ.10 వేలు వసూలు చేయాల్సి ఉంటే.. రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో పాఠశాలలు తెరవడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. విద్యార్థుల కారణంగా వారి ఇంట్లో వారి ప్రాణాలకూ వైరస్‌ ముప్పు పొంచి ఉంది. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? దేశమంతా పరీక్షలు వాయిదా వేస్తే రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ ఇస్తారు. ఇప్పటికే పాఠశాలలు తెరిచి 130 మంది ఉపాధ్యాయులు చనిపోవటానికి కారణమయ్యారు. కొవిడ్‌లో పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు కూడా ఎగ్గొట్టి వారిని విధుల నుంచి తొలగించారు. వ్యాక్సినేషన్‌లో కూడా రాష్ట్రం విఫలమైంది’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని