Chandrababu: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.

Updated : 03 Oct 2023 15:26 IST

దిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోపు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతకుముందు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, అభిషేక్‌ సింఘ్వీ, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున సుప్రీం సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదించారు. 

ఆ సెక్షన్‌ వర్తిస్తుందా? లేదా? అన్నదే ప్రధానం: హరీశ్‌ సాల్వే

తొలుత హరీశ్‌ స్వాలే వాదనలు వినిపిస్తూ రాజకీయ ప్రతీకార చర్యలు నివారించడానికి సెక్షన్‌ 17ఏ తీసుకొచ్చారని.. ఈ కేసులో ఆ సెక్షన్‌ వర్తిస్తుందా? లేదా? అన్నదే ప్రధానమన్నారు. ఆరోపణలు ఎప్పటివనేది కాదని.. కేసు నమోదు, విచారణ ఎప్పుడన్నదే చర్చించాల్సిన అంశమని చెప్పారు. అనంతరం అభిషేక్‌ సింఘ్వీ వాదించారు. అవినీతి నిరోధక చట్ట సవరణలో ప్రతి పదం సునిశితంగా పరిశీలించి నిర్ధారించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘‘కేబినెట్‌ నిర్ణయాలకు సీఎం ఒక్కరే బాధ్యులు కాలేరు. ఆ నిర్ణయాలు అధికార నిర్వహణలో భాగం. అధికార నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలపై ప్రతీకార చర్యల నుంచి 17ఏ రక్షణ కల్పిస్తుంది. యశ్వంత్‌ సిన్హా కేసులో కోర్టు తీర్పు ఈ కేసుకు కచ్చితంగా వర్తించి తీరుతుంది. ట్రాప్‌ కేసు తప్ప మిగిలిన 6 రకాల ఆరోపణలకు 17ఏ వర్తిస్తుంది. 2015 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాలపై ఆరోపణలు ఉన్నాయి. చట్ట సవరణ తర్వాత మరో ఏడాది కాల వ్యవధిని ఈ కేసులో చేర్చారు’’ అని అభిషేక్‌ సింఘ్వీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

2017లోనే కేసు మూలాలు.. 17ఏ వర్తించదు: ముకుల్‌ రోహత్గీ

ఆ తర్వాత సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. 2018 జులైలో చట్ట సవరణ వచ్చిందని.. 2021లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని చెప్పారు. 2017లోనే కేసు మూలాలు ఉన్నందున 17ఏ వర్తించదన్నారు. కేసు విచారణ ముందే జరిగిందనడానికి ఆధారాలు, పత్రాలు ఏమైనా ఉన్నాయా? అని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ ప్రశ్నించారు. దీనిపై రోహత్గీ స్పందిస్తూ 10శాతం ప్రభుత్వం సంస్థ, 90 శాతం ప్రైవేటు సంస్థ పేరుతో రూ.వందలకోట్ల దుర్వినియోగం జరిగిందన్నారు. కేసు మెరిట్స్‌పై చర్చ జరగట్లేదని.. ఆ వివరాల్లోకి వెళ్లొద్దని రోహత్గీకి జస్టిస్‌ అనిరుద్ధ బోస్ సూచించారు. పిటిషనర్‌ కౌంటర్‌ కూడా వేయలేదని రోహత్గీ కోర్టుకు తెలిపారు. ఈ దశలో సిద్ధార్థ లూథ్రా కలుగజేసుకుని కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పించామని చెప్పారు. డాక్యుమెంట్లు సమర్పించేందుకు సమయం కావాలని రోహత్గీ కోరారు. మొత్తం కేసు వివరాలతో సిద్ధంగా ఉన్నామని లూథ్రా తెలిపారు. బెయిల్‌ కోసం వెళ్లకుండా క్వాష్‌ పిటిషన్‌పైనే వాదిస్తున్నారన్న రోహత్గీ..  అఫిడవిట్‌ వేసేందుకు సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు