Chandrababu: పేరుకే వైకాపాలో బీసీలకు పదవులు.. పెత్తనమంతా అగ్రకులాలదే: చంద్రబాబు

జగన్‌ పేరుకే వైకాపాలో బీసీలకు కొన్ని పదవులు ఇచ్చి పెత్తనమంతా అగ్ర కులాలకు అప్పగించారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. మాయమాటలు చెప్పి బీసీలను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బీసీ సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.

Updated : 01 Dec 2022 15:25 IST

జంగారెడ్డిగూడెం: రాష్ట్రంలో ‘బీసీలకు ఇదేం ఖర్మ’ అని బీసీ సంఘాలు ఇంటింటా చైతన్యం తీసుకురావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. బీసీల పొట్టగొట్టి, జగన్‌ రెడ్డి తన పొట్ట పెంచుకున్నారని ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బీసీ సంఘాల ప్రతినిధులతో చంద్రబాబు గురువారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్‌ పేరుకే వైకాపాలో బీసీలకు కొన్ని పదవులు ఇచ్చి పెత్తనమంతా అగ్ర కులాలకు అప్పగించారని విమర్శించారు. మాయమాటలు చెప్పి బీసీలను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. విద్వేషంతో బీసీలందర్నీ జగన్‌ అణగదొక్కుతున్నారని దుయ్యబట్టారు. అమ్మఒడి, ఇతర సంక్షేమ పథకాలు అందరికీ ఇచ్చినట్లే ఇస్తున్నారు తప్ప బీసీలకు అదనంగా ఏం చేశారని ప్రశ్నించారు. 140 బీసీ కులాలకు జగన్‌ ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తితిదేలో 16 పదవులు బీసీలకు ఇవ్వాల్సి ఉండగా.. 3 మాత్రమే బీసీలకు ఇచ్చారని విమర్శించారు. జనాభాలో 50శాతం పైగా ఉన్న బీసీలకు వివిధ నామినేటెడ్ పోస్టులు, విశ్వవిద్యాలయాల్లో ఇచ్చే ప్రాధాన్యం చాలా తక్కువని తెలిపారు. వీసీలు, సలహాదారుల్లో ఏ కులం వారు ఎక్కువగా ఉన్నారో చర్చించేందుకు జగన్‌ సిద్ధమా? అని సవాల్‌ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం 2014 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిందని.. వచ్చే ఎన్నికల్లోనూ అది పునరావృతం కానుందని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

30లక్షల ఇళ్లు కట్టి ఇస్తానన్న హామీ ఏమైంది?

అనంతరం కొయ్యలగూడెంలో నిర్వహించిన రోడ్‌ షోలో చంద్రబాబు మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రాష్ట్రంలో సీఎం జగన్‌ ఎక్కడ సభ పెట్టినా.. వచ్చే దారిలో గోడలు కడుతున్నారు. ఆయన వస్తున్నారంటే చాలు ఆ ప్రాంతానికి రెండ్రోజులు సెలవు ఇస్తారు. జగన్‌ సభకు డ్వాక్రా మహిళలు తప్పక రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. నల్ల దుస్తులు వేసుకుంటే చాలు.. జగన్ సభకు రాకూడదంటారు. కానీ, మా రోడ్‌షోలకు జనం స్వచ్ఛందంగా వస్తున్నారు. తెదేపా హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను ఇప్పటికీ ఇవ్వలేదు. 30 లక్షల ఇళ్లు కట్టి ఇస్తానన్న హామీ ఏమైంది? మద్యపాన నిషేధం విధిస్తానని కమ్మని కబుర్లు చెప్పారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, ఖనిజాలు దోపిడీ చేస్తున్నారు. పేదలను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని