Chandrababu: ప్రధాని మోదీ సూచన.. నీతి ఆయోగ్‌ సీఈవోతో చంద్రబాబు భేటీ

నీతి ఆయోగ్‌ సీఈవో పరమేశ్వరన్‌ అయ్యర్‌(Parameswaran iyer)తో తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) భేటీ అయ్యారు.

Updated : 06 Dec 2022 14:16 IST

దిల్లీ: నీతి ఆయోగ్‌ సీఈవో పరమేశ్వరన్‌ అయ్యర్‌(Parameswaran iyer)తో తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) భేటీ అయ్యారు. జీ-20 సదస్సు (g20 summit) నిర్వహణపై సోమవారం ప్రధాని మోదీ (PM Modi) అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో డిజిటల్‌ నాలెడ్జ్‌ అంశంపై చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన సూచించిన అంశాలను తన ప్రసంగంలో ప్రధాని ప్రస్తావించారు. డిజిటల్‌ నాలెడ్జ్‌ విజన్‌ డాక్యుమెంట్‌పై నీతి ఆయోగ్‌ (Niti Aayog) అధికారులతో చర్చించాలని చంద్రబాబుకు ప్రధాని సూచించారు. దీనిలో భాగంగానే నీతి ఆయోగ్‌ సీఈవోతో ఆయన సమావేశమయ్యారు.

అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు ఏం మాట్లాడారంటే..

జీ-20 సదస్సుపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు కీలక సూచనలు చేశారు. దేశ భవిష్యత్‌ ప్రయాణంపై విజన్‌ డాక్యుమెంట్‌ సిద్ధం చేసుకోవాలని.. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ నంబర్‌ వన్‌గా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మనం సరైన సమయంలో ఐటీ, డిజిటల్‌ వ్యవస్థను అందుకోగలిగాం. మేధోసంపన్నమైన ఆర్థిక వ్యవస్థకు ఐటీ వెన్నెముక. దీన్ని అందిపుచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇందుకు కారణం మన యువశక్తి సామర్థ్యాలే. ఈ పైచేయి మరో పాతికేళ్లు నిరాటంకంగా కొనసాగుతుంది.

యువశక్తిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకొనేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తే 2047 నాటికి మన దేశం నంబర్‌ వన్‌గా ఎదగడం ఖాయం. దానివల్ల భారతీయులు ఉద్యోగ, సంపద సృష్టికర్తలుగా మారి.. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, రాజకీయ, కార్పొరేట్‌ వ్యవస్థలను శాసించగలిగే స్థాయికి చేరొచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీ నాయకత్వంలో ‘ఇండియా ఎట్‌ హండ్రెడ్‌ ఇయర్స్‌- గ్లోబల్‌ లీడర్‌’ పేరుతో విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాలి’’ అని చంద్రబాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని