Chandrababu: రాష్ట్రం నుంచి కంపెనీలను వైకాపా తరిమేస్తోంది: చంద్రబాబు

పరిశ్రమలను ఆకర్షించేందుకు రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతుంటే, వైకాపా మాత్రం కంపెనీలను తరిమికొడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. భూములను వెనక్కి తీసుకుంటూ, అనుమతి ఇవ్వకుండా వేధిస్తోందని ఆరోపించారు.

Published : 03 Dec 2022 16:04 IST

అమరావతి: రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడం కోసమే జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను, సామర్థ్యాన్ని నాశనం చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో ఉద్యోగావకాశాలు, ఆర్థిక వ్యవస్థ రెండింటినీ చంపేసి వైకాపా తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటోందని మండిపడ్డారు. ఈ మేరకు చంద్రబాబు ట్విటర్‌లో వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

పరిశ్రమలను ఆకర్షించేందుకు రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతుంటే, వైకాపా మాత్రం కంపెనీలను తరిమికొడుతోందని  ఎద్దేవా చేశారు. భూములను వెనక్కి తీసుకోవడం, దాడులతో వేధించడం, అనుమతులు నిరాకరించడం వంటి చర్యలతో ఏపీ ప్రతిష్టను రోజురోజుకీ దిగజారుస్తోందని విమర్శించారు. ప్రజలిచ్చిన అధికారానికి ద్రోహం చేసిన జగన్‌.. రాష్ట్రంలో క్షమించరాని తప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి రూపంలో ఉన్న ఈ రాక్షసుడు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని దుయ్యబట్టారు. రాయలసీమలో 4 దశాబ్దాల కాలంలో దాదాపు లక్ష కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించి రాష్ట్రానికే గర్వకారణంగా అమరరాజా సంస్థ నిలిచిందన్నారు. బిలియన్ డాలర్ కంపెనీ ఇప్పుడు తన సొంత రాష్ట్రాన్ని విడిచిపెట్టి సుమారు రూ.9,500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి తెలంగాణకు తరలిపోయిందన్నారు. ఏపీలో ఉన్న పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేసి వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని చంద్రబాబు మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని