Chandrababu: జగన్‌ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: చంద్రబాబు

అధికారంలోకి రాకముందు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని జగన్‌ ఏం చెప్పారు?అమరావతే రాజధానిగా ఉంటుంది.. తెలుగుదేశం పార్టీ కంటే మిన్నగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పారా? లేదా? అని చంద్రబాబు నిలదీశారు.  

Updated : 09 Feb 2023 17:43 IST

అమరావతి: సీఎం జగన్‌ (ys jagan mohan reddy), ఆ పార్టీ నేతల తీరు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి రెండుకళ్లు లాంటి అమరావతి, పోలవరంను దెబ్బతీశారని మండిపడ్డారు.  ‘‘రాష్ట్ర రాజధానిపై నిన్న కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేసింది. శివరామకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టులో ప్రస్తావించింది. శివరామకృష్ణ కమిటీ నివేదికను రాష్ట్రానికి పంపామని, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని కేంద్రం తెలిపింది. ఆ నిర్ణయాన్ని తాము ఆమోదించామని కేంద్రం చెప్పింది. ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం తమను సంప్రదించకుండానే 3 రాజధానుల చట్టం తెచ్చిందని కేంద్రం అఫిడవిట్‌లో స్పష్టంగా తెలిపింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగానే కేంద్రం ఈ విషయాలు చెప్పింది.

అధికారంలోకి రాకముందు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని జగన్‌ ఏం చెప్పారు. అమరావతే రాజధానిగా ఉంటుంది. అమరావతిని తెలుగుదేశం పార్టీ కంటే మిన్నగా అభివృద్ధి చేస్తామని చెప్పారా? లేదా? ప్రజా జీవితం అంటే మీ దృష్టిలో చులకనైపోయింది. మీ తీరు చూస్తూ ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. ఓట్ల కోసం ఎన్నో అబద్దాలు చెప్పారు. చట్టానికి ఎన్ని తూట్లు పెట్టాలో అన్ని పెట్టి మీ ఇష్ట ప్రకారం చేశారు. అధికారం లేదని తెలిసినా? రాజధానిపై చట్టం చేసే హక్కు శాసనసభకు లేదా? అని మాట్లాడారు. రాజధానిపై చట్టం చేయడానికి వీల్లేదని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం పార్లమెంట్‌ చేసింది. అందులో రాజధాని ఏ విధంగా చేయాలో స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారం అమరావతి రాజధాని వచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని చట్టం చేసే హక్కులేదని న్యాయస్థానం చెప్పింది.  దాన్ని వక్రీకరించి.. శాసనసభకు చట్టాలు చేసే అధికారం లేదా? అని ఇష్టానుసారం మాట్లాడారు. విభజన చట్టం సెక్షన్‌5లో రాజధానిపై స్పష్టంగా ఉన్నా 3 రాజధానులపై శాసనసభలో బిల్లు పాస్‌ చేశారు. కౌన్సిల్‌లో నానా దుర్భాషలాడారు. 3 రాజధానుల బిల్లును కౌన్సిల్‌ సెలెక్ట్‌ కమిటీకి  పంపిస్తే.. కౌన్సిల్‌ రద్దుకు తీర్మానం చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి కౌన్సిల్‌ రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకున్నారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇచ్చారు. అమరావతి రాజధానిపై రూ.11,395 కోట్లు ఖర్చు పెడితే.. జగన్‌ ప్రభుత్వం అమరావతిపై విషం చిమ్మింది. రాజధాని రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తే ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు. లేని అధికారం ఆపాదించుకుని జగన్‌ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు’’ అని చంద్రబాబు విమర్శించారు.

సైకో వల్ల రాష్ట్రం నాశనం కావటానికి వీల్లేదు..

ఒక సైకో వల్ల రాష్ట్రం నాశనం కావటానికి వీల్లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన జగన్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అమరావతిపై వైకాపా నేతలు చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని తేలిందన్నారు.అమరావతి నిర్మాణం ముందుకు సాగి ఉంటే పన్నుల రూపేణా రాష్ట్రమంతటికీ ఆదాయం వచ్చి ఉండేదని పేర్కొన్నారు.ప్రజావేదికతో ప్రారంభమైన అమరావతి విధ్వంసం ఇప్పుడు రోడ్లు తవ్వేసేదాకా వచ్చిందని విమర్శించారు. జగన్‌రెడ్డి మభ్య పెట్టడంలో దిట్ట, దోచుకోవటంలో అనకొండ అని ధ్వజమెత్తారు. పెట్టుబడులన్నీ తరిమేసి ఏం ఒరగబెట్టడానికి విశాఖ వెళ్తున్నానని జగన్‌ చెబుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రూ.45వేల కోట్లు కాజేసి, గంజాయి రాజధానిగా విశాఖను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరాన్ని నిర్వీర్యం చేసి గోదావరిలో ముంచేశారని దుయ్యబట్టారు. రుషికొండకు కూడా బోడి గుండు కొట్టించిన ఘనుడు జగన్‌ అని విమర్శించారు. విభజన చట్టం వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన నష్టమే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. విధ్వంసకర చర్యల వల్ల మళ్లీ కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని చేశారని ఆక్షేపించారు. రోజు గడిస్తే చాలన్నట్టు వైకాపా ఎమ్మెల్యేలు బానిసల్లా బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాక్షేత్రంలో జగన్‌రెడ్డిని దోషిగా నిలబెట్టి తీరుతామని స్పష్టం చేశారు. సైకో చేతిలో రాష్ట్ర రాజధాని పేరిట వివిధ సందర్భాల్లో అమరావతి పై జగన్‌ చేసిన ప్రసంగాల వీడియోను మీడియా సమావేశం లో చంద్రబాబు ప్రదర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని