Chandrababu: వైకాపా 31 మంది ఎంపీలు ఏం సాధించారు?: బడ్జెట్‌పై స్పందించిన చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. 2023-24 బడ్జెట్ సమ్మిళిత అభివృద్ధి లక్ష్యం సాధించేలా ఉందని అన్నారు.

Updated : 01 Feb 2023 19:49 IST

అమరావతి: ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా భారత్ నిలవడం శుభపరిణామం అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. వ్యవసాయ, మౌలిక రంగాలను నిలబెట్టేలా కేంద్ర బడ్జెట్ (Union Budget 2023) ప్రణాళికలున్నాయని తెలిపారు. అయితే, పోలవరం సహా పలు ప్రాజెక్టులు, రాష్ట్రానికి కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ సమ్మిళిత అభివృద్ధి లక్ష్యం సాధించేలా ఉందని చంద్రబాబు అన్నారు.  2014లో ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ.. ఇప్పుడు ఐదో స్థానంలోకి రావడం గొప్ప విషయమని కొనియాడారు. 2047 లక్ష్యంగా పథకాలు, కార్యక్రమాల రూపకల్పన దిశగా ఆలోచనలు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు, పీఎం ఆవాస్ యోజన పథకం కింద గృహ నిర్మాణం కోసం రూ.79 వేల కోట్లు, ఆక్వా రంగానికి రూ.6వేల కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. రవాణా రంగంలో 100 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై రూ.75 వేల కోట్ల పెట్టుబడులు ఉత్తమ ఫలితాలను ఇస్తాయని అభిప్రాయపడ్డారు. ఆదాయపు పన్ను శ్లాబ్‌లలో మార్పులు తెచ్చి వేతన జీవులకు ఊరట కల్పించారని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రాజెక్టులకు ఆశించిన కేటాయింపులు లేకపోవడం నిరుత్సాహం కలిగించిందని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కరవు ప్రాంతాల కోసం కేంద్ర బడ్జెట్‌లో రూ.5,300 కోట్లు కేటాయించారని చంద్రబాబు అన్నారు. 

జగన్ సర్కార్‌ పూర్తిగా విఫలమైంది..

విభజన చట్టం ప్రకారం ఏపీలో 7 వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాల్సి ఉన్నా.. వాటిని సాధించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, విభజన హామీల అమలు, రాజధాని నిర్మాణానికి నిధులు సాధించడంలో జగన్ సర్కార్‌ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. విభజన హామీల అమలుకు ఇదే చివరి బడ్జెట్ అని.. ఈ బడ్జెట్‌లోనూ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో 31 మంది ఎంపీలు ఉండి ఏం సాధించారని నిలదీశారు. ప్రాజెక్టులు, నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో సీఎం జగన్, వైకాపా ఎంపీలు పూర్తిగా చేతులు ఎత్తేశారని దుయ్యబట్టారు. సొంత కేసులు, స్వప్రయోజనాలకు మాత్రమే వైకాపా ఎంపీలు కట్టుబడి ఉన్నారని రుజువైందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు