Chandrababu: అమ్మ ఒడి బూటకం.. ఇంగ్లిష్‌ మీడియం ఒక నాటకం: చంద్రబాబు

చిత్తూరు జిల్లా మదనపల్లె లో ‘ఎన్టీఆర్‌ స్ఫూర్తి-చంద్రన్న భరోసా’ పేరుతో తెదేపా భారీ బహిరంగ సభ నిర్వహించింది. జిల్లా నలుమూలల నుంచి భారీగా

Published : 07 Jul 2022 01:57 IST

మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లె లో ‘ఎన్టీఆర్‌ స్ఫూర్తి-చంద్రన్న భరోసా’ పేరుతో తెదేపా భారీ బహిరంగ సభ నిర్వహించింది. జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు...‘‘మూడేళ్లుగా అరాచక పాలనపై పోరాటం చేస్తున్నాం. ఎక్కడ చూసినా సమస్యలు.. లేని సమస్యలు సృష్టించారు.  ప్రశ్నించిన వారిని బెదిరించి కేసులు పెడుతున్నారు. మేం కన్నెర్ర చేస్తే వైకాపా నాయకులు బయటకు రాలేరు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఏమీ సాధించలేరు. మేం తలచుకుంటే జగన్‌ పాదయాత్ర చేసే వారా? ఆరోజు ఊరూరా తిరిగి ముద్దులు పెట్టి... ఇప్పుడేమో పిడిగుద్దులు గుద్దుతున్నారు. పేద పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకున్న పార్టీ తెదేపా. మా హయాంలో ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు కట్టించాం. అమ్మ ఒడికి ఆంక్షలు పెట్టి తల్లులను మోసం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల పార్టీ. అమ్మ ఒడి బూటకం, ఇంగ్లిష్‌ మీడియం ఒక నాటకం, నాడు- నేడు అవినీతి మయం’’ అని చంద్రబాబు విమర్శించారు.

ప్రభుత్వంపై పోరాడేందుకు ఇంటికొకరు రావాలి
‘‘వైకాపా ప్రభుత్వం వచ్చాక అన్నింటిపై బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదలపై తీవ్ర భారం మోపారు. మళ్లీ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచారు. నిత్యావసరాల ధరలు పెరిగాయి. కొత్త బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యం తెస్తున్నారు. ల్యాబ్‌ పరీక్షలో మద్యంలో రసాయనాలు ఉన్నాయని తేలింది. జగన్‌ .. సొంత డిస్టిలరీలు పెట్టుకుని రేట్లు పెంచారు. నాసిరకం మద్యం తెచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆటలా? మూడేళ్లలో ఐదుసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. కొత్తగా రూ.5వేల కోట్ల వృత్తి పన్ను వేస్తున్నారు. ఈ ప్రభుత్వంపై పోరాడేందుకు ఇంటికొకరు ముందుకు రావాలి. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. ఏమైంది? నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారు’’ అని చంద్రబాబు ఆరోపించారు. మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డితో పలువురు జిల్లా నేతలు, కార్యకర్తలు భారీగా తరలి రావడంతో మదనపల్లె జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పార్టీ నేతలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని