
Lalu Prasad Yadav: తేజస్వితో చిరాగ్ పొత్తు కుదుర్చుకోవాలి..!
పట్నా: లోక్ జన్శక్తి పార్టీ(ఎల్జేపీ) అధ్యక్షుడిగా చిరాగ్ పాశ్వాన్ మాత్రమే ఉండాలంటూ రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత లాలూ ప్రసాద్ యాదవ్ సూచించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్తో చిరాగ్ పాశ్వాన్ పొత్తు కుదుర్చుకోవాలన్నారు. చిరాగ్ పాశ్వాన్, పశుపతి కుమార్ పరాస్ మధ్య కొంతకాలంగా పార్టీ నాయకత్వ పోరు కొనసాగుతున్న నేపథ్యంలో లాలూ తాజా వ్యాఖ్యలు బిహార్ రాజకీయాల్లో అగ్గి రాజేశాయి. కష్టకాలంలో తనకు భాజపా అండగా నిలవకపోగా.. పశుపతి పరాస్కు కేంద్ర కేబినెట్లో చోటు కల్పించడంపై చిరాగ్ అసంతృప్తితో ఉన్నారు.
అధికారంలోకి వచ్చాక కూటమిలోని పార్టీలను భాజపా విస్మరించిందంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ గతంలో ఆరోపించారు. చిరాగ్ పాశ్వాన్కు తన మద్దతు తెలిపారు. రాష్ట్రానికి రామ్ విలాస్ పాశ్వాన్ చేసిన కృషికి గుర్తుగా ఆయన జయంతి వేడుకలను తమ పార్టీ నిర్వహిస్తుందని వెల్లడించారు. కుల వివక్ష, పేదరికం, సామాజిక అసమాతలను నిర్మూలించేందుకు రామ్ విలాస్ పాశ్వాన్ పోరాటం చేసినట్లు వివరించారు. ఆయన విలువలు, ఆశయాల సాధనకు కృషి చేయడమే.. ఆయనకు అర్పించే గొప్ప నివాళి అని పేర్కొన్నారు.