CM KCR: కేంద్రం.. రాష్ట్రాలకు ఉనికి లేకుండా చేస్తోంది: కేసీఆర్
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు సందర్భంగా సీఎం కేసీఆర్ సభలో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ జరిగింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు కేసీఆర్ సమాధానమిస్తూ ప్రసగించారు.
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు సీఎం కేసీఆర్ సభలో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ జరిగింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు కేసీఆర్ సమాధానమిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం గుడ్న్యూస్ చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెలాంటి పొరపాటు చేయొద్దని.. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామన్నారు. సెర్ప్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని కేసీఆర్ చెప్పారు. అంతకుముందు రాష్ట్రాల పట్ల కేంద్ర వ్యవహరిస్తోన్న తీరుపై కేసీఆర్ మండిపడ్డారు.
‘‘చట్ట సభల్లో చర్చల సరళి మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం పరిణతి చెందే క్రమంలో మరింత మెరుగుపడాలి. సమకాలీన, సామాజిక ధోరణులపై సమీక్షించి చర్యలు తీసుకోవాలి. బడ్జెట్ అంటే అంకెల గారడీ అనే అభిప్రాయం దేశంలో ప్రబలి ఉంది. పార్లమెంటు, రాష్ట్రాల్లో బడ్జెట్ ప్రవేశపెడితే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బడ్జెట్ అద్భుతంగా ఉందని అధికారపక్ష నేతలు చెబుతుంటారు. బడ్జెట్లో పసలేదని విపక్ష నేతలు తమ అభిప్రాయం చెబుతారు. ఏళ్ల తరబడి ఇదే విధమైన ధోరణి కొనసాగుతోంది. సమకూర్చుకున్న నిధుల వినియోగంపై అభివృద్ధి ఆధారపడి ఉంది. ప్రపంచంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. స్వాతంత్ర్యం వచ్చాక దేశ తొలి బడ్జెట్ రూ.190కోట్లు మాత్రమే. ఆ బడ్జెట్లో రూ.91కోట్లు రక్షణ నిధికి కేటాయించారు. ప్రస్తుతం రాష్ట్రాల బడ్జెట్ రూ.లక్షల కోట్లకు పెరిగింది. బడ్జెట్ను రెండు రకాలుగా.. ప్రభుత్వ, ప్రైవేట్ బడ్జెట్గా పరిగణించవచ్చు. ప్రైవేట్ బడ్జెట్ వ్యక్తిగత బ్యాంకు ఖాతా నిల్వలపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ బడ్జెట్ విషయానికి వచ్చేసరికి తారుమారు అవుతుంది. కొన్ని పన్నులు.. రాష్ట్రాలు, మరికొన్ని కేంద్రం పరిధిలో ఉంటాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, ఆర్థిక కమిషన్ నిధుల మేరకు బడ్జెట్ తయారీ ఉంటుంది.
రాష్ట్రాల ఉనికి లేకుండా చేస్తామన్న చర్యలు కేంద్రం చేపడుతోంది. బలమైన కేంద్రం, బలహీన రాష్ట్రాలు అనే నినాదం అందుకున్నారు. ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేక చర్య ఇది. ఈ పెడధోరణి కొనసాగితే దేశానికే నష్టం. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేక విధానాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలి. ఐఏఎస్, ఐపీఎస్లు ప్రభుత్వ పాలనలో ప్రధాన పాత్ర పోషిస్తారు. అలాంటి అధికారులను ఎప్పుడుపడితే అప్పుడు మార్చేస్తామంటున్నారు. ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పాం. వారిని చెప్పుచేతల్లో పెట్టుకునే చర్యలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న మత కలహాలు పెట్టి ప్రజలను విడదీయాలని చూస్తున్నారు. బెంగళూరులో హిజాబ్ పంచాయతీ పెట్టారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన దుస్తులు ధరిస్తారు. అలానే హైదరాబాద్లో కలహాలు సృష్టించే ప్రయత్నాలు చేశారు. ఇలాంటి ధోరణి ఉంటే పెట్టుబడులకు ఎవరొస్తారు?అనేక దేశాల వారు హైదరాబాద్లో పని చేస్తున్నారు’’ అని కేసీఆర్ అన్నారు.
కేంద్రం పనితీరు దిగజారిపోయింది..
‘‘దేశంలో ఆర్థిక విధానాన్ని నిర్ణయించేది, నియంత్రించేది కేంద్ర ప్రభుత్వం. కొద్ది మేర మాత్రమే రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ వ్యవహారం బాగుంటే దేశమంతా బాగుంటుంది. ప్రస్తుతం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వ ధోరణి ఉంది. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగంలో ఉంది. అలాంటి రాష్ట్రాలను అణచివేసే చర్యలను కేంద్రం చేపడుతోంది. కేంద్రం పనితీరు తెలంగాణ కంటే దిగజారిపోయింది. ప్రస్తుతం భారత్ అప్పు రూ.152 లక్షల కోట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం 58.5 శాతం అప్పులు తీసుకుంటోంది. రాష్ట్రాలు మాత్రం 25 శాతంలోపు అప్పు తీసుకోవాలని ఉంది. కేంద్రం ఇష్టానుసారం నిధుల సమీకరణ చేస్తూ రాష్ట్రాలను తొక్కిపెడుతోంది. తెలంగాణ అద్భుతాలు సాధిస్తోందని ఆర్బీఐ చెబుతోంది. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరవేతలో పారదర్శకత పెంచగలిగాం. అప్పులను వనరుల సమీకరణగా పరిగణిస్తారు. అప్పులు చేసే రాష్ట్రాల క్రమంలో తెలంగాణ 25వ స్థానంలో ఉంది’’ అని సీఎం పేర్కొన్నారు.
ఇరిగేషన్ విభాగంలోకి వీఆర్ఏలు..
‘‘వీఆర్ఏలను ఇరిగేషన్ విభాగంలోకి తీసుకుంటాం. వారికి స్కేల్ ఇచ్చి లష్కర్ పోస్టులోకి తీసుకుంటాం. కాల్వల నిర్వహణ కోసం లష్కర్లు పనిచేస్తారు. వీఆర్ఏలలో చాలామంది విద్యాధికులు ఉన్నారు. వారిలో చాలా మంది ప్రమోషన్ కోసం చూస్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల విషయంలో ఆలస్యం చేయబోయేది లేదు’’ అని సీఎం వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి