Cm Kcr: అప్పుడు విమర్శలు చేసిన ఏపీలోనే ఇప్పుడు అంధకారం: సీఎం కేసీఆర్‌

‘‘తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో ఈ ప్రాంతానికి వస్తే పది మంది కార్యకర్తలు ఉండేవారు. ప్రజల్లో కూడా పెద్దగా ఆశ ఉండేది కాదు. కేసీఆర్‌ వస్తుండు.. పోతుండు..

Updated : 21 Feb 2022 19:23 IST

నారాయణఖేడ్‌: ‘‘తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో ఈ ప్రాంతానికి వస్తే పది మంది కార్యకర్తలు ఉండేవారు. ప్రజల్లో కూడా పెద్దగా ఆశ ఉండేది కాదు. కేసీఆర్‌ వస్తుండు.. పోతుండు.. తెలంగాణ వస్తదా.. రాదా.. అని అనేక సందేహాలు ఇక్కడి ప్రజల్లో ఉండేవి. వేరే పార్టీల వారు కూడా ప్రజలను గందరగోళానికి గురి చేసేవారు. తెలంగాణ వస్తే తప్ప పరిస్థితులు మారవని ఉద్యమం చేశా. ఉద్ధృతంగా ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ వస్తే పరిశ్రమలు మూతపడతాయని కొంత మంది చెప్పారు. తెలంగాణ నాయకులకు పరిపాలన చేతకాదన్నారు. రాష్ట్రంలో అంధకారం అలుముకుంటుందని అవాస్తవాలు ప్రచారం చేశారు. అప్పుడు విమర్శలు చేసిన ఏపీలోనే ఇప్పుడు అంధకారం ఉంది. తెలంగాణలో 24 గంటల నిరంతర విద్యుత్‌ అందిస్తున్నాం. తలసరి విద్యుత్‌ వినియోగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఏడేళ్లలో తెలంగాణ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

అంతకుముందు పర్యటనలో భాగంగా నారాయణ ఖేడ్‌ చేరుకున్న సీఎం.. రూ.సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల పథకాల శిలాఫలకాలు ఆవిష్కరించారు. గతంలో నారాయణఖేడ్‌ చాలా వెనకబడి ఉండేది. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అభివృద్ధి పనులు చేపట్టారు. జహీరాబాద్‌లో చెరువుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఈ ఎత్తిపోతల ద్వారా నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, ఆందోల్‌, సంగారెడ్డి నియోజకవర్గాలకు లబ్ధి చేకూరనున్నట్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో రూ.4,427 కోట్లతో చేపట్టే ఎత్తిపోతల పథకాల ద్వారా 3.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. రానున్న రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం వెల్లడించారు.

జిల్లాలోని పంచాయతీలకు రూ.140 కోట్లు..

‘‘జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ ప్రాంతాలకు నీరందాలి. ఏడాదిన్నరలోపు ప్రాజెక్టులు పూర్తి చేసేలా నేతలు కృషి చేయాలి. గజ్వేల్‌ కంటే ఎక్కువగా ఆందోల్‌కు నీళ్లు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆందోల్‌కు 1.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సంగారెడ్డి జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేశాం. మరోసారి సంగమేశ్వర ఆలయానికి వచ్చినప్పుడు వైద్య కళాశాలకు శంకుస్థాపన చేస్తాను. సంగారెడ్డి, జహీరాబాద్‌ మున్సిపాలిటీలకు రూ.50 కోట్లు చొప్పున నిధులు మంజూరు చేస్తా. మిగతా 6 మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున నిధులు ఇస్తాం. అలాగే సంగారెడ్డి జిల్లాలోని పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున రూ. 140 కోట్ల నిధులు మంజూరు చేస్తాం. సంగారెడ్డి జిల్లాలో అన్ని తండాలకు రోడ్లు వేయిస్తాం. నిధులు విడుదల చేస్తూ రేపు జీవోలు జారీ చేస్తాం. పల్లె ప్రగతి ద్వారా అద్భుతంగా పనులు జరుగుతున్నాయి. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రైతు బంధు సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతుంది. రైతులు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు.

అమెరికా కంటే గొప్పగా భారత్‌..

‘‘బంగారు భారత్‌ను రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలి. భారత్‌ను అమెరికా కంటే గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. ఇప్పటివరకు మన విద్యార్థులు అమెరికా వెళ్లేవారు. విదేశీ విద్యార్థులే భారత్‌కు వచ్చే విధంగా అభివృద్ధి జరగాలి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశాన్ని బాగు చేసుకుందాం’’ అని సీఎం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని