Congress: జోడో యాత్రలో ‘పాక్‌’ నినాదాలు.. ఇదంతా భాజపా మాయ: కాంగ్రెస్‌

భాజపా నీచ రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్‌ విమర్శించింది. భారత్‌ జోడో యాత్రకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పోతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఆరోపించారు. జోడో యాత్రలో పాక్‌ అనుకూలంగా నినాదాలు చేశారంటూ భాజపా చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

Published : 26 Nov 2022 00:25 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ నినాదాలు చేశారంటూ భాజపా ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్‌ మాలవ్యా పోస్టు చేసిన వీడియోపై కాంగ్రెస్‌ స్పందించింది. ఇదంతా  భాజపా చేసిన మాయ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. భాజపా నాయకులు పనికి మాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించింది. అధిష్ఠానం నుంచి మార్కులు కొట్టేసేందుకే ఇంతటి నీచానికి దిగజారుతున్నారని దుయ్యబట్టింది.. భాజపా ఐటీ సెల్‌ను ‘డర్టీ ట్రిక్స్‌ డిపార్ట్‌మెంట్‌’ గా కాంగ్రెస్‌ అభివర్ణించింది.

మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న జోడో యాత్రలో రాహుల్‌ గాంధీతోపాటు, ప్రియాంక గాంధీ వాద్రా, మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ తదితరులు ర్యాలీగా సాగుతుండగా.. వెనక నుంచి పాక్‌కు అనుకూలంగా నినాదాలు వినిపిస్తున్న ఓ వీడియోను  అమిత్‌ మాలవ్యా ట్విటర్‌లో పోస్టు చేశారు. తొలుత ఈ వీడియోను కాంగ్రెస్‌ ఎంపీ ట్విటర్‌లో పోస్టు చేసిన కొద్దిసేపటికే తొలగించారు. ‘‘జోడో యాత్రలో పాల్గొంటానంటూ నటి రిచా చద్దా బహిరంగంగా ప్రకటించిన తర్వాతే పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు వినిపించాయి. ఈ వీడియోను కాంగ్రెస్‌ ఎంపీ పోస్టు చేసి తొలగించారు’’ ఇదీ కాంగ్రెస్‌ అసలు స్వభావం అని మాలవ్యా ట్విటర్‌లో పేర్కొన్నారు.

దీనిని కాంగ్రెస్‌ తీవ్రంగా పరిగణించింది. భాజపా చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కమ్యూనికేషన్స్‌ ఇన్‌ఛార్జి జైరాం రమేశ్‌ మండిపడ్డారు. భారత్‌ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతుండటంతో ఓర్వలేక.. ఇలాంటి పనులకు ఒడిగడుతోందని విమర్శించారు. ఈ అంశంపై న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు. ‘‘మేం కూడా వాళ్లలాగే  బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌లు మార్చగలం. భాజపా మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని  అన్నారు. మరోవైపు టార్‌పుర్‌ జిల్లాలోని గిరిజనులు భారత్‌ జోడో యాత్రలో పాల్గొనకుండా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆడ్డుకుంటోందని జైరాం రమేశ్‌ ఆరోపించారు. ఇది భాజపా రాజ్యాంగం ఇలాగే ఉంటుందని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని