Congress-NCP: గుజరాత్‌ అసెంబ్లీ పోరు.. కాంగ్రెస్‌, ఎన్సీపీల ముందస్తు పొత్తు!

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి.. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు జట్టుకట్టాయి. శుక్రవారం ముందస్తు పొత్తు ప్రకటించాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 182 స్థానాలకుగానూ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ.. మూడింట పోటీ చేయనుంది.

Published : 11 Nov 2022 21:52 IST

గాంధీనగర్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నిక(Gujarat Elections)ల్లో పోటీకి.. కాంగ్రెస్(Congress), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP)లు జట్టుకట్టాయి. శుక్రవారం ముందస్తు పొత్తు ప్రకటించాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 182 స్థానాలకుగానూ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ.. మూడింట పోటీ చేయనుంది. ఇరు పార్టీల నేతలు అహ్మదాబాద్‌లో సమావేశమై వివరాలు వెల్లడించారు. 2017 ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కూటమి ఏర్పాటుకు విఫలయత్నం చేశాయి. దీంతో వేర్వేరుగానే ఎన్నికల బరిలోకి దిగాయి. ఎన్సీపీ తరఫున.. కేవలం కందాల్‌ జడేజా ఒక్కరే కుతియాణా స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

‘గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎన్సీపీలు కలిసి పోటీ చేయనున్నాయి. కూటమిలో భాగంగా ఆనంద్‌ జిల్లాలోని ఉమ్రేఠ్‌, అహ్మదాబాద్‌లోని నరోదా, దాహోడ్‌లోని దేవ్‌గఢ్‌ బరియా స్థానాలనుంచి ఎన్సీపీ అభ్యర్థులు పోటీ చేస్తారు’ అని జీపీసీసీ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ వెల్లడించారు. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఒకే భావజాలం కలిగిన వారితోపాటు రాజ్యాంగ పరిరక్షణ, దేశ సమైక్యతను కాపాడేందుకు కృషి చేస్తున్నవారు ఒక్కతాటిపైకి వస్తున్నారని.. ఈ కూటమి కూడా అందులో భాగమేనని ఠాకూర్‌ అన్నారు. మరోవైపు.. ఎన్సీపీ కేటాయించిన ఈ మూడు స్థానాలూ ప్రస్తుతం అధికార భాజపా చేతిలో ఉన్నాయి.

గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని ఎన్సీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జయంత్ పటేల్ విలేకరులతో చెప్పారు. ‘మూడు స్థానాల్లో నిజాయతీగా పోటీ చేస్తాం. మాపై ఉంచిన నమ్మకానికిగానూ కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు. ఎన్సీపీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా ఎటువంటి పనులు చేయం’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. గుజరాత్‌లో డిసెంబరు 1, 5న రెండు దశల్లో పోలింగ్‌ నిర్వహించనున్న విషయం తెలిసిందే. డిసెంబరు 8న ఫలితాలు వెల్లడించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని