తేయాకు తోటల్లో ప్రియాంక గాంధీ..

త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రం అసోంలో కాంగ్రెస్‌ ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక

Updated : 02 Mar 2021 15:38 IST

గువాహటి: త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రం అసోంలో కాంగ్రెస్‌ ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రెండో రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా బిశ్వనాథ్‌ ప్రాంతంలోని సాధురు టీ ఎస్టేట్‌కు వెళ్లి అక్కడి కూలీలతో మాట్లాడారు. 

తేయాకు తెంపుతూ..

టీ తోటల్లోకి వెళ్లిన ప్రియాంక.. అక్కడి కూలీలతో కలిసి కాసేపు పనిచేశారు. తలకు బుట్టవేసుకుని తేయాకు తెంపారు. అనంతరం తోట పక్కనే కూర్చుని కూలీలతో ముచ్చటించారు. ‘‘తేయాకు కూలీలు అసోంతో పాటు ఈ దేశానికి కూడా విలువైనవారు. మీ హక్కులను పరిరక్షించేందుకు, మీకు గుర్తింపు తెచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎల్లవేళలా పోరాడుతూనే ఉంటుంది’’ అని ప్రియాంక ఈ సందర్భంగా తెలిపారు. 

ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట అయిన అసోంలో గత ఎన్నికలు హస్తం పార్టీకి గట్టి షాకిచ్చాయి. ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను గద్దెదించి భాజపా అక్కడ కాషాయ జెండా ఎగురవేసింది. దీంతో ఈ సారి అసోం ఎన్నికలు కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అయితే కీలక నేత, మాజీ సీఎం తరుణ్‌ గొగొయి మరణం కాంగ్రెస్‌కు లోటుగా మారింది. దీంతో ఈశాన్య రాష్ట్రంలో రంగంలోకి దిగిన ప్రియాంక గాంధీ.. ప్రజలతో మమేకమవుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని