Karnataka: అందరూ బెంగళూరు వచ్చేయండి: ప్రలోభాల భయంతో అభ్యర్థులకు కాంగ్రెస్ ఆదేశాలు

కర్ణాటకలో శనివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. (Karnataka Elections 2023)

Updated : 12 May 2023 15:13 IST

బెంగళూరు: ఇన్ని రోజులు కర్ణాటక(Karnataka) ప్రచారంతో హోరెత్తింది. ఓటింగ్‌ ముగిసిన నాటి నుంచి ఇప్పుడు నేతల్లో కొత్త ఆందోళనలు నెలకొన్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ప్రకారం హంగ్‌కు ఎక్కువ అవకాశం ఉండటంతో తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ‘ఆపరేషన్ కమలం’లో తమ ఎమ్మెల్యేలు చిక్కకూడదని కాంగ్రెస్(Congress) ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అభ్యర్థులు బెంగళూరు వచ్చేయాలని, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండాలని సూచించింది. రేపు ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో హస్తం పార్టీ ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది. (Karnataka Elections 2023)

హంగ్‌ అవకాశం ఉంటుందని ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించినప్పటికీ.. భాజపా, కాంగ్రెస్ తమకే పూర్తిస్థాయి మెజార్టీ దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అలాగే అంచనాలకు తగ్గట్టుగా హంగ్ వచ్చినా.. అధికార పీఠం కోసం ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తమవైపు ఆకర్షించేందుకు రెండుపార్టీలు వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం. 

కాంగ్రెస్‌, భాజపా మమ్మల్ని సంప్రదించాయి: కుమారస్వామి

ఎగ్జిట్ పోల్స్‌( Exit Polls) అంచనాల తర్వాత కాంగ్రెస్, భాజపా నేతలు తమను సంప్రదించారని జేడీ(ఎస్‌) నేత హెచ్‌డీ కుమారస్వామి ఇదివరకు వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికే మేం నిర్ణయం తీసుకున్నాం. సరైన సమయంలో దానిని ప్రకటిస్తాం’అని జేడీ(ఎస్‌)కు చెందిన తన్వీర్‌ అహ్మద్ తెలిపారు. ఇప్పుడు కుమారస్వామి కింగ్ మేకర్‌గా మాత్రమే కాదు.. కింగ్‌గా మారబోతున్నారని జోస్యం చెప్పారు. 

సీఎం పోస్టుపై డీకే కామెంట్‌..

కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలపై డీకే శివకుమార్‌ (DK Shivakumar)ను ప్రశ్నించగా.. పరోక్షంగా స్పందించారు. ‘పార్టీకోసం ఎంతగానో కష్టపడ్డాను. రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు నాకు అప్పగించిన తర్వాత నేను నిద్రపోలేదు. వేరేవారిని నిద్ర పోనివ్వలేదు. పార్టీకి ఏది అవసరమో అది చేశాను. కాంగ్రెస్‌ పార్టీ ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’అని వ్యాఖ్యానించారు. 

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో తొలుత భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, బలనిరూపణలో విఫలమవడంతో మూడు రోజులకే యడ్డీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగా.. ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఏడాదికే కుప్పకూలింది. అనంతరం భాజపా మళ్లీ పగ్గాలు అందుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని