Nizam Properties: నిజాం భూముల స్వాధీనానికి పాదయాత్ర చేయాలా?: జగ్గారెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా భాజపా పావులు కదుపుతోందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. భాజపా కుట్రకు తెరాస, వైతెపాలు పావులుగా పని చేస్తున్నాయని విమర్శించారు....

Published : 01 Sep 2021 01:14 IST

హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా భాజపా పావులు కదుపుతోందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. భాజపా కుట్రకు తెరాస, వైతెపాలు పావులుగా పని చేస్తున్నాయని ఆరోపించారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్‌, డీజిల్, గ్యాస్‌ ధరలు తగ్గించే ధైర్యం భాజపాకు ఉందా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జైలుకు పంపుతామన్న భాజపాను ఎవరు అడ్డుకున్నారని నిలదీశారు. ‘‘ విద్వేషాలు రెచ్చగొట్టడానికే తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారు. నిజాం భూములను స్వాధీనం చేసుకోవడానికి పాదయాత్ర ఎందుకు?భాజపా, తెరాస, ఎంఐఎమ్ ఈ మూడు పార్టీలు అన్నదమ్ములే’’ అని జగ్గారెడ్డి విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ సతీమణి విజయమ్మ కొత్త నాటకానికి తెరలేపారని జగ్గారెడ్డి విమర్శించారు. ‘‘ రాజశేఖర్ రెడ్డితో అనుబంధం వేరు, రాజకీయం వేరు. వైతెపా అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ కోడలే. విజయమ్మ తెలంగాణకు ఏమవుతారు. ఏపీలో కుమారుడిని సీఎం సీటుపై కూర్చోబెట్టి.. ఇక్కడ భాజపాతో స్నేహం చేస్తున్నారు. కుమార్తెతో కలిసి మళ్లీ తెలంగాణకు వస్తు్న్నారు’’ అని జగ్గారెడ్డి విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని