Congress: మోదీ, షా నుంచి మార్కులు కొట్టేందుకే ఈటల ఆరోపణలు: కాంగ్రెస్‌

మునుగోడు ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి డబ్బులు ఇచ్చారంటూ భాజపా ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ, అమిత్ షాల దగ్గర మార్కులు కొట్టేసేందుకే ఆయన ఈ ఆరోపణలు చేశారని అన్నారు.

Updated : 22 Apr 2023 15:41 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ బలపడుతుందనే భయం భాజపా నేతల్లో కనిపిస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విపక్షాలు ఏకమై పోరాడాల్సిన పరిస్థితి నుంచి విచ్ఛిన్నమయ్యే పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. ఈటల వ్యాఖ్యలు అవగాహన లేమితో చేసినవో, లేదా కోపంలో చేసినవో అర్థం కావడం లేదన్నారు. గొప్పలు చెప్పుకొని భాజపాలో చేరిన ఈటల.. పార్టీలో ఎవరూ చేరకపోవడంతో సంయమనం కోల్పోతున్నారని విమర్శించారు. ‘‘రూ.18 వేల కోట్లు పెట్టి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కొన్నారు. ఈటల ఆరోపణలు నిజమైతే.. రేవంత్‌రెడ్డి సవాల్‌ స్వీకరించాలి. దమ్ముంటే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలి. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా దగ్గర మార్కులు కొట్టేందుకే ఈటల ఆరోపణలు చేశారు. మరోవైపు భాజపాని పైకి లేపేందుకు కేసీఆర్‌ పనిగట్టుకున్నారు. ఓట్లు చీల్చేందుకు భాజపాకి కేసీఆర్‌ హైప్‌ ఇస్తున్నారు. భాజపాకి చిత్తశుద్ధి ఉంటే భారాసపై పోరాడాలి. కాంగ్రెస్‌లో చేరేందుకు ఈటల గతంలో రేవంత్‌రెడ్డితో సంప్రదింపులు జరిపారు. వ్యాపారాలు కాపాడుకునేందుకే ఈటల భాజపాలో చేరారు’’ అని అద్దంకి దయాకర్‌ విమర్శించారు.

రేవంత్‌పై ఆరోపణలు చేస్తే పదవి ఇస్తారని: సుధీర్‌ కుమార్‌ రెడ్డి

భాజపాలో ఎవరు చేరినా వారి మీద కేసులు ఉంటాయని, ఆ పార్టీలో కేసీఆర్‌ కోవర్టులు ఉన్నాయని మరో టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్‌కుమార్‌ రెడ్డి అన్నారు. భాజపాలో కేసీఆర్‌ కోవర్డులు ఉన్నారని ఈటల రాజేందర్‌ స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో రూ. వందల కోట్లు ఖర్చుపెట్టి ఈటల రాజేందర్‌ గెలుపొందారని ఆరోపించారు. లెఫ్టిస్ట్‌ రాజేందర్ రైటిస్ట్‌గా మారారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తే భాజపాలో పదవి వస్తుందని ఈటల భావిస్తున్నారని విమర్శించారు.‘‘దేవాలయ భూములను కొల్లగొట్టిన ఈటల.. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారు. ఆయనపై ఉన్న కేసులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. చిత్తశుద్ధి ఉంటే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు వచ్చి ఈటల ప్రమాణం చేయాలి’’ అని సుధీర్‌కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఒప్పందంలో భాగమే..: ఈరవత్రి అనిల్‌

కేసీఆర్‌తో ఒప్పందంలో భాగంగానే ఈటల రాజేందర్ భాజపాలో చేరారని కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌ అన్నారు. వారిద్దరి మధ్య మంచి అవగాహన ఉందన్నారు. కాంగ్రెస్‌ బలం తగ్గించేందుకు వారిద్దరూ వ్యూహం పన్నారని విమర్శించారు. ఒప్పందంలో భాగంగానే హుజురాబాద్‌ ఉప ఎన్నికలో ఈటలపై కేసీఆర్‌ బలహీన వ్యక్తిని పోటీకి దించారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని