‘కాంగ్రెస్‌ పార్టీ వెంటిలేటర్‌పై.. ఆ నేతల మూర్ఖత్వం యాక్సలరేటర్‌పై..’

ఇటీవల లండన్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భాజపాను ఉద్దేశించి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ........

Updated : 24 May 2022 01:31 IST

రాహుల్‌ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఫైర్‌

దిల్లీ: ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భాజపాను ఉద్దేశించి లండన్‌లో చేసిన తీవ్ర వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఉనికి వెంటిలేటర్‌పై ఉంటే.. ఆ పార్టీ నేతల మూర్ఖత్వం యాక్సిలరేటర్‌పై ఉందంటూ వ్యాఖ్యానించారు. హజ్‌ ఓరియెంటేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఆయన దిల్లీలో విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడంపై ఉన్న మోజు మన దేశ పరువు తీసే కుట్ర స్థాయికి చేరుకుందని విరుచుకుపడ్డారు. ద్వేషాన్ని వ్యాప్తి చేయడమే భాజపా సిద్ధాంతమంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి.. కాంగ్రెస్‌ పార్టీ ఉనికి వెంటిలేటర్‌పై ఉంటే.. ఆ పార్టీ నేతల మూర్ఖత్వం యాక్సలరేటర్‌పై ఉందన్నారు.

ప్రతికూల ఫ్యూడల్‌ మనస్తత్వం కారణంగా కాంగ్రెస్‌ పార్టీ స్థానికంగా కూడా ఆమోదయోగ్యంగా ఉండలేకపోతోందని నఖ్వీ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రమాదకరమైన భావజాలంతో పోరాడకుండా.. ఆ పార్టీలో నేతల ప్రమాదకర మూర్ఖత్వంతో పోటీ పడుతోందని వ్యాఖ్యానించారు. ఓ కుటుంబ ఫొటో ఫ్రేమ్‌లో స్థిరపడిపోయిన కాంగ్రెస్‌ పార్టీ.. ఓ నకిలీ కిట్టీ పార్టీగా పరిమితమైపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నేతలు పరాయి దేశంలో మన దేశ పరువు తీస్తున్నారంటూ ఇటీవల యూకేలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి నఖ్వీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేతలు కొన్నిసార్లు భారత్‌ను పాకిస్థాన్‌, శ్రీలంక, ఇతర దేశాలతో పోలుస్తారని, ఇంకొన్ని సార్లు దేశం పరువు తీసేందుకు, సామరస్యం, సహనాన్ని దెబ్బతీసేందుకు భయం, ద్వేషం ఉందంటూ కల్పిత ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ఆ పార్టీ నేతల అజ్ఞానం, మూర్ఖత్వాన్ని ప్రతిబింబిస్తోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని