Corruption: ‘40 శాతం కమీషన్‌’ వ్యవహారం.. కర్ణాటక మంత్రి ఈశ్వరప్పపై కేసు..!

కర్ణాటకలో ఇటీవల వెలుగు చూసిన ‘40 శాతం కమీషన్‌’ వ్యవహారం భాజపా ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది.

Published : 13 Apr 2022 15:47 IST

రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తోన్న కాంట్రాక్టర్‌ ఆత్మహత్య

మంగళూరు: కర్ణాటకలో ఇటీవల వెలుగు చూసిన ‘40 శాతం కమీషన్‌’ వ్యవహారం భాజపా ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌  శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పపై తాజాగా కేసు నమోదయ్యింది. సివిల్‌ కాంట్రాక్టర్‌ ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలపై మంత్రిపై కేసు నమోదు చేసినట్లు మంగళూర్‌ పోలీసులు వెల్లడించారు. సూసైడ్‌ నోట్‌తోపాటు బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, మంత్రి ఈశ్వరప్పతోపాటు మరోఇద్దరిని నిందితులుగా చేర్చినట్లు తెలిపారు.

తన చావుకు రాష్ట్ర మంత్రి ఈశ్వరప్ప కారణమని పేర్కొంటూ సంతోష్‌ పాటిల్‌ అనే ఓ సివిల్‌ కాంట్రాక్టర్‌ ఇటీవల ఉడుపిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆశయాలను పక్కనబెట్టి ఈ నిర్ణయం తీసుకున్నానని.. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితోపాటు భాజపా నేత యడియూరప్పలు తన కుటుంబాన్ని ఆదుకోవాలని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో తన సోదరుడి మరణానికి మంత్రి ఈశ్వరప్ప కారణమంటూ సంతోష్‌ సోదరుడు ప్రశాంత్‌ పాటిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందళగ గ్రామంలో చేపట్టిన రూ.4కోట్ల పనుల్లో 40శాతం కమీషన్‌ కావాలంటూ తన సోదరుడుని మంత్రితోపాటు ఆయన అనుచరులు వేధించినట్లు అందులో పేర్కొన్నాడు. ఈ కాంట్రాక్ట్‌కు సంబంధించి బిల్లులను విడుదల చేయాలంటూ ఎన్నోసార్లు (దాదాపు 80 సార్లు కలిసినట్లు) మంత్రికి మొరపెట్టుకునప్పటికీ ఫలితం లేదన్నారు. మంత్రి అనుచరులు బసవరాజు, రమేశ్‌లు తమకు 40 శాతం కమీషన్‌ ఇవ్వాలంటూ వేధించారని ఆరోపించారు.

ఇదిలా ఉంటే, 40శాతం కమీషన్‌ వ్యవహారంపై కర్ణాటకలోని కాంట్రాక్టర్ల సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజాప్రతినిధులకు సమర్పించాల్సిన కమీషన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటీవలే ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలోనే సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య చేసుకోవడం కర్ణాటక ప్రభుత్వాన్ని ఇరుకునపడేశాయి. ఈ అంశంపై అటు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మంత్రి ఈశ్వరప్పను వెంటనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఇలా అన్ని విధాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో మంత్రిపై చర్యలకు భాజపా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని