Karnataka Elections: ఆయనతో విభేదాల్లేవ్‌.. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశా: డీకే శివకుమార్‌

సిద్ధ రామయ్యతో (Siddaramaiah) తనకు ఎలాంటి విభేదాలు లేవని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ (DK Shiva Kumar) స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగాలు చేసి, సిద్ధరామయ్యతో కలిసి పని చేశానని చెప్పారు. 

Published : 14 May 2023 17:20 IST

బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్యతో (Siddaramaiah) తనకు ఎలాంటి విభేదాలు లేవని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ (DK Shiva kumar)స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగాలు చేసి, సిద్ధ రామయ్య తరఫున నిలిచానని అన్నారు. 135 స్థానాల్లో విజయం సాధించి..ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌.. సీఎంగా ఎవరిని నియమించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

‘‘ నాకు, సిద్ధరామయ్యకు మధ్య విభేదాలు ఉన్నాయని చాలా మంది అంటున్నారు. కానీ, మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. చాలా సార్లు పార్టీ కోసం నేను త్యాగాలు చేశాను. సిద్ధరామయ్యతో కలిసి నడిచాను. ఆయనకు మద్దతుగా నిలిచాను’’ అని డీకే శివకుమార్‌ తెలిపారు. శనివారం వెల్లడించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ 135 స్థానాలను కైవసం చేసుకోగా.. భాజపా 66, జేడీఎస్‌ 19 స్థానాలకు పరిమితమయ్యాయి. మెజారిటీ సాధించిన కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అయితే, ముఖ్యమంత్రి పదవి కోసం మాజీ సీఎం సిద్ధ రామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ  ఇద్దరికీ సీఎం పదవి చేపట్టగలిగే సత్తా ఉండటంతో ఎవరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలన్న దానిపై అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ లాంటి రాష్ట్రాల్లో రెబల్స్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న హస్తం పార్టీ, మళ్లీ అలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది.

కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలంతా ఆదివారం సాయంత్రం సమావేశమై.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. మరోవైపు మొత్తం ఐదేళ్ల కాలంలో ఇద్దరికీ చెరో రెండున్నరేళ్లపాటు సీఎం పదవి ఇచ్చేందుకు అధిష్ఠానం మొగ్గు చూపవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఈ నిర్ణయం కూడా పార్టీకి భవిష్యత్‌లో తలనొప్పిగా మారే అవకాశాలు లేకపోలేదు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కుర్చీ కోసం భూపేశ్‌ భగేల్‌, టీఎస్‌ సింగ్‌ మధ్య పోటీ ఏర్పడింది. అధిష్ఠానం జోక్యం చేసుకొని ఇద్దరూ చెరో రెండున్నరేళ్ల చొప్పున సీఎంగా ఉండే సర్ది చెప్పింది. అయితే, తొలుత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన భూపేశ్‌.. రెండున్నరేళ్ల తర్వాత ఆ పదవికి రాజీనామా చేసేందుకు తిరస్కరించారు. మరోసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కాంగ్రెస్‌ జాగ్రత్తపడే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని