DK Shivakumar: వెన్నుపోటు పొడవను.. బ్లాక్‌మెయిల్ చేయను: సీఎం ఎంపిక వేళ డీకే వ్యాఖ్య

కర్ణాటక సీఎం పదవికోసం గట్టిగా పోటీపడుతున్న పీసీసీ అధ్యక్షుడు శివకుమార్(DK Shivakumar) మంగళవారం దిల్లీకి వెళ్లారు. అంతకుముందు తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు. 

Published : 16 May 2023 11:36 IST

దిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) పార్టీ అఖండ విజయం సాధించినప్పటికీ.. కర్ణాటక సీఎం(Karnataka CM Post) పీఠంపై కూర్చునేదెవరో తేలలేదు. ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar) మంగళవారం దిల్లీకి వెళ్లడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తానెవరినీ వెన్నుపోటు పొడవనని, బ్లాక్‌ మెయిల్ రాజకీయాలు చేయనని వెల్లడించారు. అలాగే తాను ఒక్కడినే దిల్లీకి వెళ్తున్నట్లు చెప్పారు. 

‘వచ్చే ఏడాది జరగనున్న లోకసభ ఎన్నికల్లో 20 సీట్లు గెలవడమే ప్రస్తుతం మా ముందున్న సవాలు. మాది ఉమ్మడి కుటుంబం. మా సంఖ్య 135. నేను ఎవరినీ విడదీయాలనుకోవడం లేదు. నేనొక బాధ్యతాయుతమైన వ్యక్తిని. ఎవరినీ వెన్నుపోటు పొడవను. బ్లాక్‌మెయిల్ చేయను. నా మీద ఎలాంటి మచ్చ లేకుండా చూసుకోవాలనుకుంటున్నా. పార్టీ వల్లే నేను ఈ స్థానంలో ఉన్నాను. పార్టీనే మా ఇల్లు. మేమంతా కలిసి దానిని నిర్మించుకున్నాం. ఆ ఇంటిలో నేనొక వ్యక్తిని. ఆ ఇంట్లో తల్లి.. బిడ్డకు ప్రతిదీ ఇస్తుంది. సోనియా గాంధీ మాకు రోల్‌ మోడల్‌. మాకు పార్టీ రాజ్యాంగం ముఖ్యం. కాబట్టి దాని ప్రకారమే అందరి ప్రయోజనాలు కాపాడాలి’ అని శివకుమార్(DK Shivakumar) అన్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని తెలిపారు. పార్టీ నిర్ణయం ఏదైనా దానికి కట్టుబడి ఉంటాననేలా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. 

కర్ణాటక ముఖ్యమంత్రిగా సీనియర్‌ నేత సిద్ధరామయ్య(Siddaramaiah)కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. మరి ఈ సమయంలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు ఏ పదవి కట్టబెడతారనేది తెలియాల్సి ఉంది. తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో డీకే కీలక పాత్ర పోషించారు. ఆయనపై ఉన్న ఈడీ, ఆదాయపు పన్ను కేసులే ఇప్పుడు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. ఆయన్ని ముఖ్యమంత్రిగా చేస్తే భాజపా నాయకత్వం మరింత గురిపెట్టి ఏదోవిధంగా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించే అవకాశం ఉంటుందని, అందుకే సిద్ధూవైపే పార్టీ మొగ్గుచూపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని